2004 సునామీ: ఆ ఘోర విపత్తుకు 16 ఏళ్లు... మెరీనా బీచ్ వద్ద మృతులకు పూలతో నివాళి
చెన్నై: 2004 డిసెంబర్ 26... ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల వేడుకల నుంచి బయటకు రాకముందే సునామీ రూపంలో పెను విపత్తు పలు దేశాలను కబళించింది. ఆ విషాదం జరిగి నేటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. నాడు రిక్టర్ స్కేల్పై 9.1 తీవ్రతతో హిందూ మహా సముద్రంలో ఏర్పడిన భూకంపం ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. మరెందరినో అనాథలుగా మిగిల్చింది. సునామీ దెబ్బకు రాకాసి అలలు దాదాపుగా 57 అడుగుల ఎత్తుకు ఎగిసి పడి ఒడ్డున ఉన్న చాలామందిని తనలో కలిపేసుకుపోయాయి. తీరప్రాంతాలని కుదేలయ్యాయి. ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్ దేశాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. ఇక మీదట అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తమను చల్లగా చూడాలంటూ తమిళనాడు ప్రజలు 2005 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న సముద్రంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
2004 డిసెంబర్ 26వ తేదీన ఉదయం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఈ సునామీ ప్రభావం కనిపించింది. అదే సమయంలో కేరళ తీరంలో కూడా కనిపించింది. చెన్నై నగరంలో 13 కిలోమీటర్ల మేరా ఉన్న మెరీనా బీచ్లో ఉదయం కొందరు వాకింగ్కు వచ్చారు. రోజూవారీలా వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రాకాసి అలలు తీరంపై దాడి చేసి అక్కడున్న వారిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. కారైకల్లో వచ్చిన సునామీతో 492 మంది ప్రాణాలు కోల్పోయారు.దాదాపు తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని ఈ సునామీ కుదిపేయగా... అత్యంత ఎక్కువగా నష్టపోయింది మాత్రం నాగపట్టణం. ఆ తర్వాత కడలూరు కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇక ఈ సునామీ దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలామంది మత్స్యకారులున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సునామీ వల్ల కృష్ణా జిల్లాలోని మంగినపూడి, మచిలీపట్నం బీచ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సింగరాయికొండలో భారీ నష్టం సంభవించింది. సునామీతో మత్సకారులు చాలా నష్టపోయారు.

2004లో వచ్చిన సునామీ ప్రభావం దాదాపు 14 దేశాల్లో కనిపించింది. మొత్తం మీద 2లక్షల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 5వేల మందికి పైగా మృతి చెందారు. అందుకే ఈ ఘోర విపత్తును ప్రతి ఏటా గుర్తుకు చేసుకుంటారు తమిళనాడు ప్రజలు. ముఖ్యంగా నాడు చెన్నై మెరీనా బీచ్లో జరిగిన బీభత్సం ఇంకా తమ కళ్ల ముందు కదులుతోందని చెబుతున్నారు స్థానికులు. నాడు క్రిస్మస్ పండుగ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన బంధువులను మరుసటి రోజు ఉదయం మెరీనా బీచ్కు తీసుకొచ్చామని... చూస్తుండగానే తమవారిని సముద్రపు రాకాసి అలలు తీసుకెళ్లాయని నాటి ఘోర విపత్తును గుర్తుకు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. అందుకే వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. అదే సమయంలో సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నామంటూ చెన్నై వాసులు చెప్పారు.
Tamil Nadu: Locals pay floral tribute to 2004 tsunami victims on the 16th anniversary at Marina Beach in Chennai. pic.twitter.com/ES154uwRUG
— ANI (@ANI) December 26, 2020












Click it and Unblock the Notifications