పెరుగుతున్న ముస్లిం జనాభా: 2050కి ఇండోనేషియాను మించనున్న భారత్
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోందని ఓ అధ్యయనం తేల్చింది. 2050నాటికి హిందువులు మూడో స్థానానికి చేరుకోనుండగా భారతదేశంలో మాత్రం ముస్లిం జనాభా ఆ సమయానికి ఇండోనేషియాను మించిపోతుందని ఆ అధ్యయనం వివరించింది.
అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ గురువారం తన అధ్యయన నివేధిక(రిలీజియస్ ప్రొఫైల్ ప్రిడిక్షన్స్)ను విడుదల చేసింది. దీని ప్రకారం 2050నాటికి హిందువుల జనాభా మూడో స్థానంలోకి వస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 34శాతం పెరుగుదల నిష్పత్తి ఉందని పేర్కొంది.
ప్రపంచ జనాభాలో 14.9శాతం హిందూ జనాభా ఉండబోతుందని, వీరిలో ఏ మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండేవారు 13.2శాతం ఉంటారని వివరించింది. ఇక ప్రపంచం మొత్తంలో ముస్లిం జనాభా పెరుగుదల శాతం హిందూ, క్రిస్టియన్ల కన్నా వేగంగా ఉందని నివేదిక పేర్కొంది.
భారతదేశంలో హిందువులు మెజార్టీ వర్గంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏ దేశంలో లేని ముస్లిం జనాభా భారతదేశంలో ఉండనుందని తెలిపింది. 'భారత దేశంలో 2050నాటికి హిందువుల జనాభా పెరగొచ్చు. అయితే, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ముస్లిం జనాభా భారత్లో పెరుగుతుంది. అది ఇండోనేషియాను మించిపోతుంది' అని నివేదిక స్పష్టం చేసింది.
2050 నాటికి ముస్లిం జనాభా 2.8 బిలియన్లు ఉండనుందని లేదా ప్రపంచంలో 30శాతం ముస్లిం జనాభా వాటాను కలిగి ఉండనుందని తెలిపింది. ఇక 2.9 బిలియన్లు లేదా 31శాతంతో క్రిస్టియన్ జనాభా ఉండనుందని తెలిపింది. అంటే కొద్ది సంవత్సరాల్లోనే క్రిస్టియన్ జనాభాను వెనక్కినెట్టి ముస్లిం జనాభా మొదటి స్థానంకు వచ్చే అవకాశం ఉంది.