షాకింగ్ : నేవీ ముంబైలో 21 మంది నావికులకు కరోనా పాజిటివ్..
ఇండియన్ నేవీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేవీ ముంబైలో పనిచేస్తున్న 21 మంది నావికులకు తాజాగా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ నెల 7న నేవీలో పనిచేస్తున్న ఓ నావికుడికి మొదట కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతనికి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. తాజాగా కరోనా సోకిన నావికులందరినీ నేవీ ఆసుపత్రిలో క్వారెంటైన్ చేశారు. అలాగే వారి కుటుంబాలను హోం క్వారెంటైన్ చేసినట్టు సమాచారం. పాజిటివ్గా తేలిన నావికుల ప్రైమరీ,సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు ప్రస్తుతం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
ఐఎన్ఎస్ ఆంగ్రెలో..
వెస్టర్న్ నావల్ కమాండ్కు అడ్మినిస్ట్రేషన్,లాజిస్టికల్ సహాయ సహకారాలను అందించే ఐఎన్ఎస్ ఆంగ్రె ఓడ రేవులో వీరంతా బస చేశారు. ఐఎన్ఎస్ ఆంగ్రేను నావల్ బ్యారక్స్ అని కూడా పిలుస్తారు. ముంబై కేంద్రంగా ఉన్న అన్ని నౌకలు మరియు యూనిట్లకు ఇది పలు సేవలందిస్తుంది. ఒకరకంగా దీన్ని మదర్ షిప్ అని కూడా అంటారు. విభిన్న శ్రేణి యూనిట్లు, సౌకర్యాల పనితీరును ఇది పర్యవేక్షిస్తుంది.
తాజా కేసులతో ప్రస్తుతం ఐఎన్ఎస్ ఆంగ్రెను పూర్తిగా లాక్ డౌన్ చేశారు. దీనికి కొద్ది దూరంలోనే యుద్ధనౌకలు,సబ్ మెరైన్స్ ఉన్న నావెల్ డాక్ యార్డు ఉంది.
ఐఎన్ఎస్ అశ్వినికి తరలింపు
కరోనా సోకిన నావికులందరినీ ముంబై నేవీ ఆసుపత్రి ఐఎన్హెచ్ఎస్ అశ్వినిలో క్వారెంటైన్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీరందరి కాంటాక్ట్స్ను గుర్తించేందుకు ప్రత్యేక ఒక టీమ్ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా వారి వివరాలు సేకరించి క్వారెంటైన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కేసులు సంఖ్య అత్యధికంగా ఉన్న ముంబైలోనే నావికులకు సైతం కరోనా పాజిటివ్గా తేలడం కలకలం రేపుతోంది.
ముంబైలోనే అత్యధిక కేసులు
ప్రస్తుతం మహారాష్ట్రలో 3320 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇందులో 331 మంది డిశ్చార్జి కాగా.. 2788 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 201 మంది మృతి చెందారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబైలోని ధారావిలో కేసుల సంఖ్య 100 దాటింది. శుక్రవారం(ఏప్రిల్ 17)న కొత్తగా మరో 15 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ అక్కడ 10 మంది మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 14,384గా ఉంది.