ప్రభుత్వ ఆస్పత్రిలో మహా విషాదం: ఒకేరోజు 24 మంది మృతి, వీరిలో 12 మంది శిశువులు
నాందేడ్: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. థానే ఆస్పత్రి ఘటన మరువకముందే.. తాజాగా, నాందేడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఘోరం జరిగిపోయింది. ఒకేరోజు వ్యవధిలోని 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది నవజాత శిశువులు కూడా ఉండటం శోచనీయం. ఆస్పత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది.
ఆగస్టులో థానేలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేరోజు 18 మంది రోగులు మరణించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, గడిచిన 24 గంటల వ్యవధిలోనే నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 మంది మృతి చెందగా.. వీరిలో 12 మంది నవజాతా శిశువులు ఉన్నారు. మృతుల్లో ఆరుగురు మగ శిశువులు, మరో ఆరుగురు ఆడ శిశువులు ఉన్నట్లు ఆస్పత్రి డీన్ శంకర్ రావు చవాన్ తెలిపారు.

మిగితా 12 మంది పలు వ్యాధులు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్లు తెలిపారు. ఈ మరణాలకు మందుల కొరత మరో కారణంగా తెలుస్తోంది. ఈ మరణాలపై ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శ్యామ్ రావు వకోడే స్పందించారు.
'ఒక్క రోజు వ్యవధిలో 12 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది వేర్వేరు కారణాలతో మరణించారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తాయి. రోగుల కోసం కేటాయించిన బడ్జెట్ సర్దుబాటు కాలేదు' అని డాక్టర్ వకోడే తెలిపారు. మరోవైపు, ఈ అంశంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మహారాష్ట్రలోని మూడు ఇంజిన్ల (బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం ) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications