ఉగ్ర కాల్పులు: ముగ్గురు మృతి, కొనసాగుతున్న ఉగ్రవేట
జమ్మూలోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
శ్రీనగర్: మరోసారి ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. జమ్మూలోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అక్కడ సివిల్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
జీఆర్ఈఎఫ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాతృసంస్థ. ఈ సంస్థ సరిహద్దుల్లోని రోడ్లు, భవనాలను నిర్వహిస్తుంటుంది. క్యాంపులోని జూరియన్ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రాంతం జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది.
ప్రస్తుతం ప్రాంతాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. ఇటీవల కాలంలో జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయి. నవంబర్ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మృతి చెందారు.