అమెరికాలో 9 ఏళ్ళలో 30 మంది తెలుగువారు మృతి;, కాల్పుల్లోనే ఎక్కువ
2008 నుండి ఇప్పటివరకు 30 మంది తెలుగువారు చనిపోయారు. అమెరికాలో చనిపోయిన 30 మందిలో తెలుగువారే అత్యధికంగా ఉన్నారు.
హైదరాబాద్:అమెరికాలో చోటుచేసుకొన్న అనేక ఘటనల్లో ఇప్పటివరకు 30 మంది తెలుగువారే మరణించారు. గత తొమ్మిదేళ్ళ కాలంలో 30 మంది పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయారు. తాజాగా శ్రీనివాస్ కూచిబొట్ల ఉదంతంతో అమెరికాలో ఉన్న భారతీయులు భయాందోళనలతో జీవనం సాగిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికేతర ప్రజలపై దాడులు విపరీతంగా పెరిగాయి. భారతీయులు కూడ ఈ జాబితాలో ఎక్కువగానే ఉన్నారు. తమ దేశం విడిచి వెళ్ళాలంటూ అమెరికన్లు భారతీయులను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని ట్రంప్ హమీ ఇచ్చాడు. అయితే ఈ మేరకు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధించాడు.ఈ నిర్ణయాలతో కొందరు అమెరికన్లు అమెరికాలో నివాసం ఉంటున్న ఇతర దేశస్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.

ఇండియన్లపై ఈ దాడులకు పెరిగిపోతున్నాయి. శ్రీనివాస్ పై కాల్పుల ఘటనతో అమెరికాలో నివాసం ఉంటున్న ఇండియన్లు మరింత ఆందోళన చెందుతున్నారు.
2008 సంవత్సరం నుండి ఇప్పటివరకు 30 మంది భారతీయులు అమెరికాలో చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది కాల్పుల బాధితులే కావడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి 10వ, తేదిన వరంగల్ జిల్లాకు చెందిన వంశీరెడ్డి కాలిఫోర్నియా జరిగిన కాల్పుల్లో మరణించాడు.గత డిసెంబర్ లో విజయవాడకు చెందిన చుండూరి సాయి తేజస్వీ కారు ప్రమాదంలో చనిపోయింది. 2016 జూలైలో సంకీర్త్ అనే హైద్రాబాద్ కు చెందిన యువకుడిని రూమ్ మేట్ హత్య చేశారు.
టెక్సాస్ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 2016 జూన్ లో ఆరిజోనాలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తున్న నంబూరి శ్రీదత్త ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి చనిపోయాడు.
హైద్రాబాద్ కు చెందిన శివకిరణ్ అనే యువకుడు డిప్రెషన్ కు గురై అమెరికాలో ఆత్మహత్య చేసుకొన్నాడు. 2015 లో సాయి కిరణ్ అనే హైద్రాబాద్ యువకుడు ఓ దొంగ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
టెక్సాస్ లో ఎలప్రోలు జయచంద్ర అనే యువకుడు కూడ ఇదే తరహలో ఓ స్టోర్ లో దొంగ జరిపిన కాల్పుల్లో మరణించాడు.ఇలా దాదాపుగా 30 మంది తెలుగువాళ్ళు వేర్వేరు కారణాల వల్ల అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు.అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో దాదాపుగా 6 లక్షల మంది తెలుగువారే నివసిస్తున్నారు.












Click it and Unblock the Notifications