కాల్పులతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం- 31 మంది మావోలు మృతి
Chhattisgarh encounter: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి రక్తమోడాయి. కాల్పుల మోతలతో దండకారణ్యం మార్మోగింది. తాజాగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం రెండు నెలల వ్యవధిలో ఇది నాలుగోసారి.
తాజాగా సంభవించిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. సంఘటన స్థలంలో మిగిలివున్న నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలను కోల్పోయారు.

ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను యాంటీ నక్సలైట్స్ జాయింట్ యాక్షన్ టీమ్ స్వాధీనం చేసుకుంది. పోస్ట్మార్టమ్ కోసం వాటిని జిల్లా ఆసుపత్రికి తరలించింది. ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా తాజాగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో విస్తరించిన అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు.
ఈ ఉదయం కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. పరస్పరం ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఉదయం మొదలైన ఈ ఎన్కౌంటర్ కొన్ని గంటల పాటు ఏకధాటిగా కొనసాగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మరణించారు. తొలుత వారిని లొంగిపోవాలంటూ హెచ్చరించామని, దీన్ని పట్టంచుకోకుండా మావోయిస్టులు కాల్పులకు దిగారని పీ సుందర్ రాజ్ తెలిపారు.
ఈ ఘటనలో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించారని, మృతదేహాలన్నింటనీ ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని సుందర్ రాజ్ చెప్పారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం ఉందని, వారికోసం పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని చెప్పారు.
చివరి మూడు నెలల్లో ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. డిసెంబర్లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా 10 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు నారాయణ్పూర్ సమీపంలోని అబూజ్మఢ్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.












Click it and Unblock the Notifications