రంగంలో దిగిన భారత్: ఉక్రెయిన్ పొరుగు దేశాలకు కేంద్రమంత్రులు: ప్రత్యేక హోదా
న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం అయిదో రోజుకు చేరుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. క్షిపణులను సంధించుకునే స్థాయికి చేరింది. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనిక బలగాలు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.. తిప్పి కొడుతోంది. ప్రతిదాడులను మరింత ముమ్మరం చేసింది. ఉక్రెయిన్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ఖార్కీవ్ వంటి కొన్ని నగరాలను కోల్పోయిన నేపథ్యం- కీవ్ను కాపాడుకోవడానికి ఆ దేశ సైనికులు సర్వశక్తులను ఒడ్డుతున్నారు.
అయిదోరోజు తీవ్రం..
మరోవంక- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి సమాయాత్తమౌతున్నారనే సమాచారం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తే- సంభవించే పెను నష్టం, ప్రభావం అంచనాలకు అందని విధంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రష్యా దూకుడును నిలువరించడానికి యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా వంటి పలు దేశాలు ఏకం అయ్యాయి. రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలను విధించాయి. అయినప్పటికీ- ఆ దేశం వెనుకంజ వేయట్లేదు.
రంగంలోకి దిగిన భారత్..
ఈ పరిణామాల మధ్య భారత్ రంగంలోకి దిగింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ విద్యార్థులు, సాధారణ పౌరులను స్వదేశానికి తీసుకుని రావడానికి తీసుకుంటోన్న చర్యలను మరింత ముమ్మరం చేయనుంది. ఇప్పటికే ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, పోలెండ్, హంగేరి, స్లొవేకియా దేశాల మీదుగా వారంతా భారత్కు రావడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధికారులు.. ఈ విషయంలో నిరంతరం శ్రమిస్తోన్నారు.
కేంద్రమంత్రులు.. ప్రత్యేక రాయబారులుగా..
ఈ చర్యలను మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంది. ఉక్రెయిన్- ఆ నాలుగు దేశాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకుని వచ్చే విషయంలో ఎలాంటి జాప్యం చోటు చేసుకోకుండా ఉండటానికి నలుగురు కేంద్రమంత్రులు బరిలో దిగారు. వారంతా ఉక్రెయిన్ పొరుగు దేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నలుగురికీ ప్రత్యేక రాయబారుల హోదా కల్పించారు.
ఆ నలుగురు వీరే..
పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి జనరల్ రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు- ఉక్రెయిన్ పొరుగు దేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు. రొమేనియా, పోలెండ్, హంగేరి, స్లొవేకియాల్లోని భారత రాయబార కార్యాలయాలను కేంద్రబిందువుగా చేసుకుని విద్యార్థులు, సాధారణ పౌరుల తరలింపు చర్యలను వారు దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఏ కేంద్రమంత్రి.. ఏ దేశానికి వెళ్తారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.
ప్రధాని అధ్యక్షతన..
ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, సాధారణ పౌరుల తరలింపు చర్యలను సమన్వయం చేసుకోవడానికి ఈ ఉదయం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. భారతీయుల తరలింపుపైనే ప్రధానంగా ఇందులో చర్చించారు. ఈ భేటీ అనంతరం నలుగురు కేంద్రమంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపించాలని నిర్ణయించారు.