కడుపా? కత్తుల ఫ్యాక్టరీనా..? : 'కానిస్టేబుల్ కడుపులో 40 కత్తులు'
అమృత్ సర్ : కడుపా..? కత్తుల ఫ్యాక్టరీనా..? ఈ వార్తంతా చదివాక ఇదే అభిప్రాయం కలగకమానదు. ఎందుకంటే.. అమృత్ సర్ వైద్యులు చేసిన ఓ అరుదైన శస్త్ర చికిత్సలో ఓ పేషెంట్ కడుపు నుంచి ఏకంగా 40 కత్తులు బయటపడ్డాయి.
శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను శుక్రవారం నాడు మీడియాకు వెల్లడించిన వైద్యులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సదరు కార్పోరేటర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర మల్హోత్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. జర్నైల్ సింగ్ అనే ఓ 42 ఏళ్ల కానిస్టేబుల్ కడుపు నొప్పి కారణంగా కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు.
అనంతరం అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. సదరు కానిస్టేబుల్ కడుపులో ఏదో పెరుగుతున్నట్లుగా గుర్తించారు డాక్టర్లు. ఇదే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి డయాగ్నోసిస్ తో పాటు ఎండోస్కోపి పరీక్షలు కూడా నిర్వహించారు. దీంతో అతడి కడుపులో పలు కత్తులు ఉన్న విషయం బయటపడింది.
సీటీ స్కాన్ ద్వారా కడుపులో కత్తులున్న విషయం స్పష్టంగా అగుపించడంతో.. విషయంపై సదరు కానిస్టేబుల్ ను ఆరా తీశారు. దీంతో అసలు విషయం అప్పుడు బయటపెట్టాడు సదరు కానిస్టేబుల్. తనో సైకాలజికల్ సమస్యతో బాధపడుతున్నానని, అందువల్లే గడిచిన రెండు నెలలుగా 40 కత్తులను మింగినట్లుగా చెప్పాడు.
అమృత్ సర్ లోని డాక్టర్ గోయల్, డాక్టర్ రాజేందర్ రాజన్, డాక్టర్ ఆర్తి మల్హోత్ర అనే కార్పోరేట్ వైద్య బృందం.. మొత్తానికి శస్త్ర చికిత్స ద్వారా ఆ కత్తులన్నింటిని బయటకు తీయగలిగారు. కానిస్టేబుల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా సమాచారం.