ఐరాస హెచ్చరిక : 2050లో ఇండియాకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం
పెరుగుతున్న నగరీకరణ భవిష్యత్తులో ఇండియాకు ముప్పుగా పరిణమించనుందని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఐరాస విడుదల చేసిన ఓ తాజా నివేదిక ఇవే విషయాలను స్పష్టం చేస్తోంది. ఇండియాలో ముఖ్యంగా ముంబాయి, కోల్ కతా దీని బారిన పడే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం 2050 వరకు సముద్ర నీటి మట్టాలు చాలావరకు పెరగడమే.
పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఇండియాలోని 40 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ప్రధానంగా ముంబాయి, కోల్ కతా పైనే ఈ ప్రభావం అధికమని నివేదిక చెబుతోంది. దీనికి కారణం ఈ రెండు నగరాలు మరింత వేగంగా విస్తరిస్తుండడం, ఎక్కువ కోస్తా తీరాన్ని కలిగి ఉండడమేనని, దీనివల్ల వరదలు సంభవించి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది ఐరాస నివేదిక.
సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ప్రపంచంలో ప్రమాదానికి గురయ్యే 10 ప్రధాన నగరాలలో 7 నగరాలు ఆసియా పసిపిక్ ప్రాంతంలోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇందులో అత్యధిక ప్రభావానికి లోనయ్యేది ఇండియా కాగా, బంగ్లాదేశ్ (25కోట్ల మంది ప్రభావితం), చైనా (20కోట్లు), ఫిలిప్పిస్స్ (15కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఆసియాలో వేగంగా విస్తరిస్తున్న నగరీకరణే దీనంతటికి కారణమని, దీంతో పాటు సామాజికి ఆర్థిక పరిస్థితులు కొంతమేర ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సూచించింది.