కరోనాతో వృద్దుడి మృతి..? అంత్యక్రియల తర్వాత వెలుగులోకి, హాజరైన 400 మంది...
ఓ వృద్దుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. కాలేయ సమస్యతో బాధపడటంతో ట్రీట్మెంట్ అందించారు. 15 రోజుల తర్వాత చనిపోయాడు. ఎందుకైనా మంచిదని.. కరోనా పరీక్షల కోసం రక్తనమూనాలను సేకరించారు. కానీ వృద్దుడి భౌతికకాయాన్ని మాత్రం అప్పగించారు. దీంతో అతని పార్థీవదేహాన్ని అప్పగించడంతో.. అంత్యక్రియలు నిర్వహించారు. వారి కుటుంబానికి ఆప్తమిత్రులు ఎక్కువగా ఉన్నందున.. 400 మంది వరకు హాజరయ్యారు. అయితే మరునాడు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో.. నోరెళ్లబెట్టడం కుటుంబసభ్యులు, బంధువుల వంతయిపోయింది.
15 రోజుల తర్వాత మృతి..
ముంబైలోని వాసాయిలో గల ఆస్పత్రికి ఆర్నాలా గ్రామానికి చెందిన 55 ఏళ్ల వృద్దుడిని తీసుకొచ్చారు. కాలేయ సమస్యతో 15 రోజుల క్రితం తీసుకురాగా.. చికిత్స అందించారు. తర్వాత అతను ఇటీవల చనిపోయాడు. మృతిచెందాక రక్తనమూనాలను సేకరించారు. కానీ రిపోర్ట్ వచ్చేవరకు ఆగితే బాగుండేది.. కానీ అలా వారు నిరీక్షించలేదు. కుటుంబసభ్యులకు భౌతికకాయం అప్పగించారు. వారు కూడా కరోనా వైరస్ కాదు కదా.. అని అంత్యక్రియలు నిర్వహించారు. కానీ వృద్దుడు కరోనా వైరస్ సోకి చనిపోయాడని తెలిసి విస్తుపోయారు.
400 మంది హాజరు
దాదాపు 400 మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇలా ఒకరినుంచి మరొకరికి వైరస్ ప్రబలే అవకాశం ఉంది. వారంతా వైరస్ ఉందెమోనని బిక్కుబిక్కుమంటున్నారు. వారికి కరోనా వైరస్ పరీక్షలు చేస్తామని అధికారులు అంటున్నారు.
Recommended Video
మహారాష్ట్రలో 85 వేల కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రెండున్నర లక్షల పాజిటివ్ కేసులు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్రలో పాజిటివ్ సోకిన వారి సంఖ్య భారీగా పెరిగింది. 85 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల నుంచి 3 వేల వరకు జరుగుతోంది. ఈ క్రమంలోనే వృద్దుడి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో పాల్గొన్న 400 మందికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. వారంతా హోం క్వారంటైన్లో ఉన్నా.. మిగతావారు మాత్రం భయపడుతున్నారు.