ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి పోటెత్తుతున్నారు- రెండు రోజుల్లో 46 లక్షల మంది
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రెండే రెండు రోజుల్లో 46 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారంటే దీనికి ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు.
లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన అన్నింట్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. బెంగళూరు సిటీ బస్సులతో పాటు కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టీసీ, వాయవ్య ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అన్ని ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది.
ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు సరిహద్దుల్లో ఉన్న స్టేజీ నుంచి గమ్యస్థానానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో 50 సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించగా.. అదే రోజు రాత్రి 12 గంటల వరకు 5,71,023 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కేఎస్ఆర్టీసీ- 1,93,831, బీఎంటీసీ- 2,01,215, నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ- 1,22,354, కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ (నార్త్ ఈస్ట్ ఆర్టీసీ)- 53,623 మంది మహిళలు ప్రయాణించారు. టికెట్ల రూపంలో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం 1,40,22,878 రూపాయలు.

రెండో రోజు అంటే సోమవారం- ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 41,34,726 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ చేశారు. కేఎస్ఆర్టీసీ- 11,40,057, బీఎంటీసీ- 17,57,887, నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ- 8,31,840, కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ (నార్త్ ఈస్ట్ ఆర్టీసీ)- 4,04,942 మంది మహిళలు ప్రయాణించారు. టికెట్ల రూపంలో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం 8,83,53,434 రూపాయలు.












Click it and Unblock the Notifications