కరోనా హాట్ స్పాట్గా ఢిల్లీ ఎయిమ్స్: వైద్యులు, నర్సులతోపాటు 480కి సోకిన మహమ్మారి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతుండగా.. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్-ఢిల్లీ) ఆస్పత్రి కరోనా హాట్స్పాట్గా మారిపోతోంది. ఈ ఆస్పత్రిలో ఏకంగా 480 మంది వైద్య సిబ్బంది కరోనా బారినపడటం గమనార్హం.

వైద్యులు, నర్సులకు కరోనా.. 480మందికి...
ఈ 480 మందిలో 19 మంది వైద్యులు, 38 మంది నర్సులు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 75 మంది ఆస్పత్రి అటెండర్లు, 54 మంది శానిటేషన్ సిబ్బంది, 14 మంది లేబొరేటరీ టెక్నీషియన్లు కాగా, మిగిలినవారు ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ముగ్గురు ఎయిమ్స్ సిబ్బంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. మృతుల్లో ఒకరు శానిటషన్ విభాగంలో ఉన్నతాధికారి కాగా, మరొకరు ఆస్పత్రి మెస్లో పనిచేసే ఉద్యోగి.

పీపీఈలపై నర్సుల ఆందోళన..
ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఎయిమ్స్ నర్సుల సంఘం ఆస్పత్రిలో తాము పనిచేసే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రి యాజమాన్యం తమకు అందించే పీపీఈ కిట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆరోపిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా మార్చి నెలలో తొలిసారిగా ఎయిమ్స్ బయటి రోగులకు అందించే వైద్య సేవలను నిలిపివేసింది.
Recommended Video

మూడో స్థానంలో ఢిల్లీ
ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఎయిమ్స్ ఆస్పత్రిలోని ట్రామా కేంద్రాన్ని పూర్తి స్తాయి కరోనా వార్డుగా మార్చి రోగులకు సేవలందిస్తున్నారు. అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 23,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 13,488 యాక్టివ్ కేసులున్నాయి. 9542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 615 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో 2,17,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,07,492 యాక్టివ్ కేసులున్నాయి. 6093 మంది కరోనాతో మరణించారు.












Click it and Unblock the Notifications