ఫెయిర్ స్కిన్తో పాటు ఈ యాడ్స్ పై కేంద్ర నజర్: ఐదేళ్లు జైలు శిక్ష..రూ.50 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును ప్రతిపాదించింది. డ్రగ్స్ చట్టంలో పలు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఆమేరకు పలు ప్రతిపాదనలు చేసింది. పలు ఫేస్ క్రీం కంపెనీలు తమ క్రీములను ప్రమోట్ చేసుకునే క్రమంలో జారీ చేస్తున్న యాడ్స్పై దృష్టి సారించింది కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ.

రూ. 50 లక్షలు ఐదేళ్లు జైలు శిక్ష
ఫేస్ క్రీములతో పాటు శృంగారంలో ఎనర్జీ ఇస్తాయని చెప్పే ఉత్పత్తుల ప్రకటనలపై, మహిళలు గర్భం దాల్చేందుకు వినియోగించే ఔషధాల ప్రకటనలపై, జుట్టు రాలకుండా ఫలానా ఔషధాలు వినియోగిస్తే సరిపోతుందంటూ చెప్పే ప్రకటనలపై సీరియస్ అయ్యింది కేంద్రం. అలాంటి సంస్థలు ఇకపై ప్రకటనలు జారీ చేస్తే రూ.50 లక్షలు జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్షను బిల్లులో ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుత చట్టం ఏం చెబుతోంది..?
ఇక ముసాయిదా సవరణల్లో భాగంగా జాబితాలో పలు జబ్బులు, ఇతరత్రా వ్యాధులను చేర్చింది. మొత్తం 78 జబ్బుల పేర్లను చేరుస్తూ వీటిని నయం చేసే మెడిసిన్స్ ఉన్నాయంటూ ప్రకటనలు జారీ చేస్తే జరిమానా తప్పదనే సవరణ చేస్తోంది కేంద్రం. వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని బిల్లులో స్పష్టం చేయనుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం తొలిసారిగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరునెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించడం జరుగుతుంది. మళ్లీ ఇదే తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించడం జరుగుతోంది.

ప్రజల నుంచి సలహాలు సూచనలను కోరిన కేంద్రం
ఇక తాజాగా సవరణల్లో తొలిసారి నిబంధనలు అతిక్రమించిన వారికి రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించడం జరుగుతుంది. మళ్లీ అదే తప్పు చేస్తే ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50 లక్షలు జరిమానా విధించేలా సవరణలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. మారుతున్న కాలం, టెక్నాలజీలను దృష్టిలో ఉంచుకునే ఈ సవరణలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్టేక్హోల్డర్లు, ప్రజల నుంచి , సూచనలు సలహాలు మార్పులు చేర్పులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సూచనలు సలహాలు మార్పులు చేర్పులు చెప్పేందుకు 45 రోజుల సమయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications