5జీ స్పెక్ట్రమ్ వేలం బిగిన్స్: అంబానీ-అదానీ పోటాపోటీ: మధ్యలో ఆ రెండూ
న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్వర్క్ ఇక అందుబాటులోకి రానుంది. 5జీ సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్ వేలం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. ఆన్లైన్ ద్వారా వేలం కొనసాగుతోంది. 5జీ స్పెక్ట్రాన్ని వేలం వేయడానికి కేంద్ర మంత్రివర్గం కిందటి నెలలోనే ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ భేటీలో దీనికి ఆమోద ముద్ర పడింది. దీనితో లాంఛనంగా ఈ వేలం ఆరంభమైంది.
డీఓటీకి అనుమతి..
5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించడానికి టెలికాం మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. 4జీతో పోల్చుకుంటే 10 రెట్ల వేగం ఉంటుంది 5జీకి. 20 సంవత్సరాల పాటు కాల పరిమితితో దీన్ని నిర్వహిస్తోంది టెలికాం శాఖ. 72097.85 మెగా హెర్ట్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రమ్ 5జీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అనుకున్న విధంగానే ఈ నెల చివరి వారం నాటికి స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను చేపట్టింది. మొత్తం మూడు ఫ్రీక్వెన్సీల్లో ఈ వేలంపాటకు వచ్చాయి.
మూడు ఫ్రీక్వెన్సీల్లో..
లో- రేంజ్ అంటే.. 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగా హెర్ట్జ్, మిడ్ రేంజ్ అంటే.. 3300 మెగా హెర్ట్జ్, అలాగే హై రేంజ్ అంటే.. 26 గిగా హెర్ట్జ్ సామర్థ్యంతో ఈ స్పెక్ట్రమ్ వేలంపాట ఉంటుంది. మిడ్ అండ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ను టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ వినియోగించుకునే అవకాశం ఉంది. 4జీతో పోల్చి చూస్తే 10 రెట్లు అధిక వేగంతో ఉండేలా దీన్ని స్పెక్ట్రమ్ ఉంటుందని అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
పైలెట్ ప్రాజెక్టులు..
కాగా- టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా- 5జీని అమలు చేయడానికి పైలెట్ ప్రాజెక్టులను ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భోపాల్, బెంగళూరు మెట్రో, గుజరాత్లోని ప్రఖ్యాత కాండ్లా దీన్ దయాళ్ పోర్ట్లను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది.
రిలయన్స్ జియో..
దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కంపెనీగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో.. 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. వెయ్యి నగరాలను ఈ నెట్వర్క్ పరిధిలోకి తీసుకుని రానుంది. తొలి దశలో 5జీ నెట్వర్క్లో విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ సొల్యూషన్ టీమ్స్ను ఏర్పాటు చేసింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. నెట్వర్క్ ప్లానింగ్లో 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పైలెట్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయి.
పోటీ పడుతోన్న కంపెనీలు ఇవే..
ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం పాటలో టెలికం బిగ్ షాట్స్ పాల్గొన్నాయి. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో, గౌతమ్ అదాని నాయకత్వాన్ని వహిస్తోన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు పోటీలో నిల్చున్నాయి. దీనితో పాటు సునీల్ మిట్టల్కు చెందిన భారతి ఎయిర్టెల్, కుమారమంగళం బిర్లా ఆధీనంలోని వొడాఫోన్ ఐడియా బిడ్స్ దాఖలు చేశాయి. మొత్తంగా ఈ ఫ్రీక్వెన్సీ హక్కుల కోసం 14 బిలియన్ డాలర్ల మేర బిడ్స్ దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.