నేడే 6వ విడత లోక్సభ ఎన్నికలు: దేశ రాజధానితోపాటు 58 స్థానాలకు పోలింగ్
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం జరగనున్న పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది. ఇక, ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 889 మంది ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆరో విడతలోనే హర్యానాలోని 10, ఢిల్లీలోని 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది. జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్ జరగాల్సి ఉండగా, కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తడంతో వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో మే 25న ఆరో విడతలో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.
కాగా, ఆరో దశ పోరులో హర్యాలో అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో పోలింగ్ జరగనుంది. వీటిలో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. కురుక్షేత్రను ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్, మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. కాగా, 2014, 2019లలో ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది. ఈసారి బీజేపీ తరఫున మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్ బరిలో ఉన్నారు.

కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఈసారి బీజేపీ తరఫున నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తా, ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా అభయ్ సింగ్ చౌటాలా బరిలో ఉన్నారు. గురుగ్రామ్ లోక్సభ స్థానంలో 2014, 2019లలో బీజేపీ గెలిచింది. హ్యాట్రిక్ కోసం మరోసారి రావ్ ఇందర్జీత్ సింగ్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్ బబ్బర్ బరిలో నిలిచారు. రోహ్తక్లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హూడా, బీజేపీ నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు.
ఢిల్లీలోని ఏడు స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె భన్సూరీ స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున మీనాక్షీ లేఖీ గెలిచారు. ఈశాన్య ఢిల్లీ స్థానంలో బీజేపీ గత రెండు ఎన్నికల్లో విజయం సాధించింది. హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ నేత మనోజ్ తివారీ విస్తృత ప్రచారమే నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు ఐదు దశల్లో 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications