అనంత్ నాగ్ లో విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు మృతి
జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ లోని బాటెంగూ వద్ద పోలీసు పార్టీపై సోమవారం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ లోని బాటెంగూ వద్ద పోలీసు పార్టీపై సోమవారం రాత్రి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భారీగా ఆయుధ సామగ్రిని వెంటతెచ్చుకున్న ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
చదవండి: నటిపై లైంగికదాడి యత్నం కేసులో ప్రముఖ హీరో అరెస్టు
ఈ దుర్ఘటనలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలైనట్లు కశ్మీర్ ఐజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ జరుపుతుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
అదే సమయంలో ఆ జాతీయ రహదారిపై వెళుతున్న బస్సులో ఉన్న అమర్ నాథ్ యాత్రికులకు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. మరో పన్నెండు మంది గాయపడినట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దించారు.
ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. దాడి కారణంగా అమర్ నాథ్ యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హిజ్బుల్పై అనుమానం
ఈ దాడి హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ చేసినట్లుగా ఐబీ అనుమానిస్తోంది. ఉగ్ర దాడికి నిరసనగా జమ్ములో బందుకు పిలుపునిచ్చారు.
మోడీ స్పందన
అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. పిరికిపంద దాడులకు, విద్వేష పూరిత వ్యూహాలకు లొంగేదిలేదన్నారు. ఆయన జమ్ము-కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడి తీవ్రమైన నేరమని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్న సంకల్పం మరింత బలపడాలని రక్షణ శాఖ మంత్రి జైట్లీ అన్నారు.