పోలవరం: ఏపీలో కలిసే 7 మండలాలివే, ఇంత భూమి...
పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీలో కలుస్తాయి. కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు, చింతూరు మండలాలు పూర్తిగా ఏపీలో కలవగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా కలుస్తాయి.
పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఏడు మండలాలలోని 211 గ్రామాలు ఏపీలో కలుస్తాయి. ఈ ప్రాంతంలో 34వేల కుటుంబాలు ఉన్నాయి. లక్షా 16వేల 796 మంది ప్రజలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. 3,267 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో 187.29 ఎకరాల అభయారణ్యం ముంపునకు గురి కానుంది. ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టు కోసం మునుగుతుంది. ఇక్కడి గిరిజనులను ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
పోలవరం ఆర్డినెన్స్కు లోకసభలో ఆమోదం లభించడం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
గుత్తా నిప్పులు
మరోవైపు పోలవరం ఆర్డినెన్స్ పైన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. మందబలం ఉపయోగించి ఆర్డినెన్స్ను ఆమోదించిందని కేంద్రం పైన విమర్శలు గుప్పించారు. మండలాల బదలాయింపును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ దీనికి వ్యతిరేకమన్నారు.