ట్విస్టుల మీద ట్విస్టులు: అజిత్ను వదిలి శరద్ వద్దకు ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు!, ఇక కేవలం ఐదుగురేనా?
ముంబై: అందర్నీ ఆశ్చర్యపరుస్తూ శనివారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెంట వెళ్లిన ఏడుగురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు చేరినట్లు సమాచారం.

బీజేపీకి అజిత్ మద్దతు
శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను తనవెంట తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గవర్నర్.. ఫడ్నవీస్, అజిత్ పవార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినట్లు ప్రకటించారు.

మోసం చేశారంటూ సీనియర్ పవార్..
ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. అజిత్ పవార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీని మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. అజిత్ పవార్ వెంట ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.. తమతోనే అందరూ ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా సీనియర్ పవార్ వద్దేకే
కాగా, ఇప్పటికే అజిత్ పవార్ దగ్గర నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. నాసిక్ జిల్లాకు చెందిన దిలీప్ బంకర్, మానిక్ రావు కొకటేలు శరద్ పవార్ వెంటే ఉంటామని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే కూడా శరద్ పవార్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలావుంటే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన మరో ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా శరత్ పవార్ చెంతకు చేరినట్లు తెలిసింది. బుల్దానా ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్నే, బీడ్ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్, మవల్ ఎమ్మెల్యే సునీల్ షేల్కే, విక్రంగడ్ ఎమ్మెల్యే సునీల్ భుసర, దిందోరి ఎమ్మెల్యే జర్హరీ జిర్వాల్, వాద్గౌన్ శెరి ఎమ్మెల్యే సునీల్ తింగ్రేలు శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. పర్లి ఎమ్మెల్యే ధనుంజయ ముండే కూడా తిరిగి సీనియర్ పవార్ చెంతకు చేరారు.

తమకేం తెలియదంటూ ఎమ్మెల్యేలు
అజిత్ పవార్ ఏమీ చెప్పకుండా తమను రాజ్భవన్కు పిలవడంతో తాము అక్కడికి వెళ్లామని ఈ ఎమ్మెల్యేలంతా చెప్పుకొచ్చారు. అక్కడ ఏం జరుగుతుందనే విషయం తమకు తెలియదని తెలిపారు. మేమంతా ఎన్సీపీ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు. శరద్ పవార్ నాయకత్వంలోనే పనిచేస్తామని తెలిపారు. 288 అసెంబ్లీ సీట్లు కలిగిన మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 145.

కేవలం ఐదుగురు తప్ప..
కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు తప్ప మిగితా వారంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శిబిరానికి చేరుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ముంబైలోని రెనయిజాన్స్ హోటల్కు వీరందరిని తరలించినట్లు తెలిసింది. దాదాపు 49మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ శిబిరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications