సీఎంగా డీకే శివకుమార్ సత్తాకు అగ్నిపరీక్ష: 7వ స్థానంపై పోరు రసవత్తరం
కర్ణాటక శాసనమండలిలోని ఏడు స్థానాల భర్తీకి ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల సమరం ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విధానసభ సభ్యులు విధానసౌధలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం ఏడు స్థానాలకు గానూ కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన ఏడో స్థానం కోసమే అసలైన పోరు నడుస్తోంది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ అయిదో అభ్యర్థిని, జేడీఎస్ ఒకరిని బరిలోకి దించాయి. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

శాసనమండలి ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి విజయం సాధించడానికి కనీసం 28 మంది శాసనసభ్యుల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్కు 134 మంది, బీజేపీకి 62 మంది, జేడీఎస్కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్కు అదనంగా స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు అవసరం కాగా.. బీజేపీ అదనపు ఓట్ల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది.
కాంగ్రెస్ తరఫున తిప్పన్నప్ప కమ్నూర్, పీవీ. మోహన్, బీకే హరిప్రసాద్, శివన్న బీఎస్, వినయ్ కార్తీక్ ప్రకాష్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి లింగరాజ్ పాటిల్, రఘు ఆర్ పోటీ పడుతుండగా, బీజేపీ కూటమి భాగస్వామి అయిన జేడీఎస్ తరఫున గోవిందరాజు రంగంలో నిలిచారు. ఏడో స్థానం విజేతను తేల్చడంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అత్యంత కీలకం కానున్నాయి. ఎమ్మెల్యేల నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.
కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను బెంగుళూరు సమీపంలోని బిడది రిసార్ట్కు తరలించింది. అక్కడ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు నమూనా బ్యాలెట్ పేపర్లతో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఓటు వృధా కాకుండా ఉంచేందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు, బీజేపీ-జేడీఎస్ కూటమి సైతం తమ ఎమ్మెల్యేల ఓట్లు చేజారకుండా గట్టి చర్యలు చేపట్టింది. జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను దేవనహళ్లి సమీపంలోని రిసార్ట్లో ఉంచింది.
కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విధానసౌధలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై ఓటింగ్ వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ తో పాటు స్వతంత్రుల మద్దతుపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు, కూటమి అభ్యర్థి గోవిందరాజు విజయం కోసం కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతల నుంచి ఆత్మప్రబోధ ఓట్లు పడొచ్చని జేడీఎస్ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications