మనీ లాండరింగ్: ఆ ఏడు మార్గాల ద్వారానే..
ఓపక్క సామాన్యులకు నగదు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు బడాబాబుల వద్ద భారీగా కొత్త నోట్లు వెలుగుచూస్తుండటం వెనుక బ్యాంకర్ల పనితీరుపై అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఆయా వ్యక్తులు, సంస్థల మీద ఐటీ డిపార్ట్మెంట్ సుమారుగా 200 దాడులు నిర్వహించింది. ఐటీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం గత వారానికి రూ.17.2కోట్ల కొత్త నోట్లను ఈ దాడుల ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో చాలామంది బడాబాబుల వద్ద పెద్ద ఎత్తున కొత్త నోట్లు బయటపడుతుండటంతో.. బ్యాంకు అధికారులే వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కాగా, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వాధికారుల హస్తం ఇందులో ఎక్కువ ఉంటుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ బ్యాంకు సిబ్బంధి తమ చేతివాటం కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి ద్వారానే చాలామట్టుకు నల్లధనం వైట్ గా మారుతోంది.
1) గుర్తింపు కార్డుల దుర్వినియోగం
బ్యాంకుల్లో ఆయా ఖాతాదారులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులను బ్యాంకర్లు దుర్వినియోగం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాన్ కార్డు లాంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. వాటిని దుర్వినియోగం చేస్తూ.. సంబంధిత ఖాతాదారులకు తెలియకుండా బ్యాంకర్లు లావాదేవీలు జరుపుతున్నారు.
ఎలా చేస్తున్నారు?:
పాత నోట్లను మార్చుకోవడానికి ఒకటి కన్నా ఎక్కువ సార్లు బ్యాంకులను ఆశ్రయించే ఖాతాదారులనే టార్గెట్ చేసుకుని బ్యాంకర్లు అక్రమ లావాదేవీలకు తెరలేపుతున్నారు. వారి గుర్తింపు కార్డుల వివరాలను నల్లకుబేరుల పాత నోట్ల మార్పిడి కోసం ఉపయోగిస్తున్నారు.
2) ఏటీఎంలు:
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో 50శాతం ఏటీఎంలు అసలు అవుటాఫ్ సర్వీస్ బోర్డులతోనే దర్శనమిస్తున్న పరిస్థితి. కొంతమంది కొత్త నోట్ల కోసం ఓపిగ్గా క్యూ లైన్లలో నిలిచివుంటే.. మరికొంతమంది క్యూ లైన్లలో నిలుచుని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.
అయితే ఈడీ,సీబీఐ,ఐటీ అధికారుల విచారణల్లో తేలిందేంటంటే.. ఏటీఎంలకు రావాల్సిన డబ్బు కూడా అక్రమ మార్గాల్లో నల్లకుబేరుల వద్దకే చేరిపోతుండటంతో.. ఏటీఎంలలోను సరిపడా డబ్బు అందుబాటులోకి రావడం లేదు. ఏటీఎంల కార్యకలాపాలను నిర్వహించే అవుట్ సోర్సింగ్ వ్యక్తులతో చేతులతో కలిపి బ్యాంకర్లే ఈ తతంగానికి తెరలేపారని తెలుస్తోంది.
అక్రమాలకు ఎలా పాల్పడుతున్నారు?
ఏటీఎంలలో డబ్బు అయిపోయిన తర్వాత వాటినుంచి ఓ ఆటోమెటిక్ మెసేజ్ వెళ్తుంది. అయితే ఏటీఎంలలో డబ్బును దుర్వినియోగం చేసినప్పుడు వాటిని పూర్తిగా మూసివేస్తున్నారు.
3)జన్ ధన్ ఖాతాల ద్వారా:
దేశంలోని ప్రతీ బ్యాంకులో 10నుంచి 15శాతం జన్ ధన్ ఖాతాలు దుర్వినియోగం అవుతున్నాయి. వీటిల్లో నల్లధనం భారీగానే వచ్చి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి చర్యలను సీబీఐ ఏమాత్రం ఉపేక్షించడం లేదు.
జన్ ధన్ ఖాతాల నుంచి అక్రమంగా!
బెంగుళూరులోని విజయనగర్ లో ఉన్న ఓ జాతీయ బ్యాంకులోని ఓ వ్యక్తి జన్ ధన్ ఖాతాలో రూ.500 మాత్రమే బ్యాలన్స్ ఉండేది. అయితే నోట్ల రద్దు తర్వాత అతని ఖాతాలోకి రూ.2లక్షలు వచ్చిపడ్డాయి. వాటిని తీసుకునేందుకు అతను బ్యాంకుకు రాగా బ్యాంకు సిబ్బంది అతన్ని తిప్పి పంపించారు.
4)డిమాండ్ డ్రాఫ్ట్స్:
బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్న ప్రక్రియల్లో ఇది అత్యంత దారుణమని అధికారులు చెబుతున్నారు.
ఇలా అక్రమాలు?
డిమాండ్ డ్రాఫ్ట్ ల ద్వారా రూ.49వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో.. చాలామంది పాత నోట్లను డీడీ ద్వారా డిపాజిట్ చేసి.. తిరిగి కొత్త నోట్లను తీసుకుంటున్నారు. రూ.49వేల కన్నా తక్కువ నగదుకు ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడంతో.. భారీ మొత్తంలో నల్లధనం వైట్ గా మారుతోంది.
5)క్యాషియర్ల కమిషన్ కక్కుర్తి:
గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో కమిషన్ల బేరసారాలు చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా పేద, చదువురాని ప్రజలు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
ఈ తతంగం ఎలా జరుగుతోందంటే?
పాత నోట్లతో వచ్చే ఖాతాదారుల నుంచి ఎలాంటి గుర్తింపు కార్డులు లాంటి తీసుకోకుండానే కొంతమంది బ్యాంకు సిబ్బంది కొత్త నోట్లను ఇస్తున్నారు. అలాగే కొన్ని నకిలీ గుర్తింపు కార్డులను బ్యాంకర్లే సృష్టించి మరీ లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
6)నకిలీ ఖాతాలు:
అనుమానం రాని ఖాతాదారుల గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తూ.. వారి పేర్ల మీద ఖాతాలు తెరిచి నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తున్నారు.
నకిలీ ఖాతాలతో లావాదేవీలు:
నకలీ లేదా వేరే ఖాతాదారుల గుర్తింపు కార్డులతో కొత్తగా తెరిచిన ఖాతాల ద్వారా భారీ మొత్తంలో పాత నోట్లు డిపాజిట్ చేయబడుతున్నాయి. అటు తర్వాత ఆ డబ్బంతా కొత్త నోట్ల రూపంలో వైట్ గా మారిపోతుంది.
7)స్వయం సహకార సంఘాలు, కోపరేటివ్ బ్యాంకుల ప్రమేయం:
చిరు వ్యాపారులకు చిన్నమొత్తాల్లో ఫైనాన్స్ చేసే ఏజెంట్స్ వారి నుంచి వసూలు చేసిన డబ్బును స్వయం సహకరా సంఘాల ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. కొన్ని కోపరేటివ్ బ్యాంకుల్లో సహకార సంఘాలకు సంబంధించి గత డిపాజిట్ల వివరాలేవి కంప్యూటర్ డేటాలో నిక్షిప్తం కాకపోవడం కూడా వీరికి కలిసొస్తుంది.
ఫైనాన్స్ వ్యాపారుల దందా:
చిన్న చిన్న వ్యాపారుల నుంచి కొత్త నోట్ల రూపంలో తమ ఫైనాన్స్ డబ్బులను వసూలు చేసుకుంటున్న మైక్రో ఫైనాన్స్ వ్యాపారులు.. అనంతరం ఆ డబ్బును పాత నోట్ల రూపంలో డిపాజిట్ చేస్తున్నారు.
మొత్తంగా పెద్ద నోట్లు రద్దు తర్వాత జరుగుతున్న భారీ అవకతవకలకు బ్యాంకులే కేంద్రాలుగా మారుతున్నాయి. బ్యాంకర్ల చేతివాటం, కమిషన్ల పర్వంతో నల్లకుబేరుల కాళ్ల వద్దకే కొత్త నోట్లు పరిగెడుతున్నాయి.