అర్థరాత్రి బాలికలు 30 కిమీలు నడిచారు (వీడియో)
బారిపాడ: ఒడిషాకు చెందిన 73 మంది బాలికలు గురువారం అర్థరాత్రి 30 కిలోమీటర్లు నడిచారు. రక్షణ కల్పిస్తామని పోలీసులు చెప్పినా వారు తిరస్కరించారు. నేరుగా జిల్లా కలెక్టర్ను కలిశారు. చలికాలంలో అది కూడా వేళ కాని వేళ తన ఇంటి ముందు అంత మంది బాలికలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు.
మయూర్ భంజ్ జిల్లా ప్రభుత్వ బాలికల హెస్కూల్ విద్యార్థినులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. హాస్టల్కు కొత్తగా వచ్చిన వార్డెన్ వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో తమ చదువులకు అంతరాయం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ రాజేష్ ప్రవాకర్ పతికి తమ సమస్యలను విన్నవించుకునేందుకు వారు సాససోపేత నిర్ణయం తీసుకున్నారు.బాలికలంతా కలిసి కాలినడకన బారిపాడ వెళ్లి అర్థరాత్రి వేళ జిల్లా కలెక్టర్ ఇంటి తలుపు తట్టారు. వారి ధైర్యానికి ఆశ్చర్యపోయిన ఆయన వారి సమస్యను శ్రద్ధగా ఆలకించారు.
తగిన చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. వారిని వాహనంలో హాస్టల్కు చేర్చాలని అధికారులను ఆదేశించారు. బాలికల వసతి గృహ సమస్యలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమించారు.