కొంపముంచిన పొగమంచు: విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ, 9 మంది దుర్మరణం
పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిల్చొని ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చండీగఢ్: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిల్చొని ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Recommended Video
ఈ ప్రమాదం భటిండా జిల్లాలోని బుచోమండి పట్టణ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. భటిండా-బర్నాల రహదారిలో అప్పుడే బస్సు దిగి మరో బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులపైకి ఓ లారీ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా.. ఏం కనిపించక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది.
ఉదయం పది గంటలైనా పొగమంచు వీడకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతున్నాయి.
పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో ముగ్గురు మృతి చెందారు.
యమున ఎక్స్ప్రెస్ వేపై 13 కార్లు ఢీ...
మరో ఘటనలో.. దట్టమైన పొగ మంచు కారణంగా గ్రేటర్ నోయిడాలోని దన్కౌర్ ప్రాంతంలో యమున ఎక్స్ప్రెస్ వేపై 13 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. బుధవారం ఉదయం నుంచీ పొగమంచు అధికంగా ఉండటంతో అసలు ముందేమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది.
అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ఎక్స్ప్రెస్ వేకు రెండు వైపులా వాహనాలు ఢీకొన్నాయని దన్కౌర్ ప్రాంత పోలీస్ అధికారి ఫర్మూద్ తెలిపారు. ఈ ఎక్స్ప్రెస్ వేపై ఒకచోట నిర్మాణం జరుగుతున్నదని, అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసినా పొగమంచు కారణంగా అవి సరిగా కనిపించడం లేదని, అందుకే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన తెలిపారు.
సిర్సాలోని ఎన్హెచ్-9పై కూడా...
హర్యానాలోని సిర్సాలోని ఎన్హెచ్-9పై జరిగిన ప్రమాదంలో కూడా మరో ఏడుగురు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ముంచుతున్నది. ఢిల్లీలో దీనికి కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.