యూపీలో ఎన్నికల వేళ జోరుగా కల్తీ మద్యం.. 9 మంది బలి.. 12 మంది పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం మాఫియా రెచ్చిపోతుంది. కల్తీ మద్యం ఏరులై పారుతుంది. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. యూపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ అజంగఢ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కల్తీ మద్యం కాటుకు 9 మంది బలి
అహ్రాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహుల్ నగర్ గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది. ఒకే గ్రామంలో 9 మంది కల్తీ మద్యం కాటుకు బలికావడంతో విషాదచాయలు అలుముకున్నాయి. ఆగ్రహంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మద్యం విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైన్ షాపు వద్ద గ్రామస్తుల ఆందోళన
మహుల్ పట్టణంలోని ఓ వైన్ షాపులో మృతులంతా మద్యం కొనుగోలు చేశారని గ్రామస్తులు తెలిపారు. ఆ మద్యం సేవించిన అనంతరం వారు తీవ్రఅస్వస్థతకు గురైయారు. పరిస్థితి విషమించడంతో వారందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. మిగతా వారు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.
యూపీ ఎన్నికల వేళ విషాదం
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. సందట్లో సడేమియాలా కల్తీ మద్యం మాఫియా రెచ్చిపోతుంది. అమాయక ప్రజలను ఆసరగా చేసుకుని కల్తీ మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు కూడా మాముళ్లకు కక్కుర్తి పడి పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.