అన్నామలై కోసం నారా లోకేష్ ఎంట్రీ, అదే రోజు కేసు పెట్టిన పోలీసులు, మోదీ వాళ్లకు చెప్పాలి సార్ !
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై మీద కోయంబత్తూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలపై అన్నామలైపై కేసు నమోదైంది. అయితే కోయంబత్తూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి నారా లోకేష్ వెళ్లిన సమయంలో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది
నియమాలు ఉల్లంఘించి అక్రమంగా సమావేశం నిర్వహించారని, రాత్రి పొద్దుపోయిన తరువాత బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి ఆరోపణలపై బీజేపీ నాయకుడు అన్నామలైపై కేసు నమోదైంది. అనుమతి ఇచ్చిన సమయం మించిపోయిన తరువాత బీజేపీ ఎన్నికల ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ విషయంపై ఒక సీనియర్ పోలీసు అధికారి ఎన్ డీ టీవీతో మాట్లాడుతూ సెక్షన్ 143, 341, 290 కింద అన్నామలైతో పాటు బీజేపీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. డీఎంకే నాయకుల ఫిర్యాదు ఆధారంగా బీజేపీ మీద మరో కేసు నమోదు చేశారు. ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత ఓటమి భయంతోనే అన్నామలై ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లను రెచ్చగొడుతున్నారని డీఎంకే నేత ఏ శరవణన్ ఆరోపించారు.
మా అహంకారం గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ అన్నామలైకి జ్ఞానోదయం చెయ్యాలని డీఎంకే నాయకులు అంటున్నారు. తమిళనాడులో అన్నామలై సమావేశాలకు జనాలు రాకపోయినా జాతీయ మీడియా పట్టించుకోలేదని డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు. డీఎంకే ఆరోపణలపై అన్నామలై స్పందిస్తూ తానేమీ తప్పు చేయలేదని, రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉందని, ఏ ఎలక్షన్ కమీషన్ అడ్డుకోలేదని అన్నారు.

అన్నామలైపై జరిగిన కుట్ర ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ స్పందిస్తూఅన్నామలై గెలుపును అడ్డుకునేందుకే ఈ తరహా కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. డీఎంకే అధికారాన్ని దుర్వినియోగం చేసి వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులను, జిల్లా కలెక్టర్ ను దుర్భాషలాడిన డీఎంకే నాయకులు అన్నామలైపై బలవంతంగా కేసు నమోదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోయంబత్తూరులో అన్నామలైని పోటీకి దింపడం ద్వారా తొలి ఎంపీ సీటును కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమాగా ఉంది. కోయంబత్తూరులో అన్నామలైని గెలిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార పార్టీ డీఎంకే నుంచి గణపతి రాజ్కుమార్ను బరిలోకి దించగా, అన్నాడీఎంకే అభ్యర్థిగా సింఘై రామచంద్రన్ బరిలోకి దిగారు. గురువారం రాత్రి నారా లోకేష్ అన్నామలైకి మద్తుగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి కోయంబత్తూరుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications