అబ్బురపరుస్తోన్న వీడియో : గణేశ్ నిమజ్జనం రోజు హృదయాల్ని కదిలించేలా!
పుణే : వినాయక నిమజ్జనం సందర్బంగా.. పూణేలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియో రూపంలో యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఆ దృశ్యాల్ని జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.
ఇంతకీ వీడియోలో ఏముందంటే..! వినాయక నిమజ్జనం సందర్బంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో అక్కడి రోడ్డు కిక్కిరిసిపోయింది. డప్పు వాయిద్యాలు, భక్తుల నినాదాల మధ్య ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది ఆ ప్రాంతం. ఇలాంటి సమయంలో.. ఓ అంబులెన్స్ అటువైపుగా వెళ్లాల్సి వచ్చింది.
సాధారణంగా.. అంతమంది జనాన్ని అదుపు చేస్తూ అంబులెన్స్ కు దారివ్వడం అంత సులువైన వ్యవహారమేమి కాదు. కానీ అక్కడి జనం మాత్రం నిలువునా చీలిపోయినట్లు.. రెండుగా విడిపోయి అంబులెన్స్ కు దారిచ్చారు. దీనంతటిని ఎవరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించడంతో.. రెండు రోజుల్లోనే 40వేల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు.
పూర్తిగా స్థంభించిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ.. మానవతా దృక్పథంతో వ్యవహరించిన అక్కడి ప్రజలను ఇప్పుడు చాలామంది అభినందిస్తున్నారు. యూట్యూబ్ లో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.