బంగాళాఖాతంలో మరో తుఫాన్: 29న తీరానికి: రాజధాని సహా ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
కోల్కత: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్.. ఈ సాయంత్రం తీరాన్ని దాటనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో కళింగపట్నం-గోపాల్పూర్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీ, ఒడిశాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావం ఇప్పటికే మొదలైంది కూడా. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.

ఏకధాటిగా వర్షాలు..
శనివారం మధ్యాహ్నం నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆ వర్షాలు ఇవ్వాళ కూడా కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఒడిశాలోని కేంద్రపారా, జగత్సింగ్పూర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా, పూరీ, గంజాం, గజపతి, కొంధమాల్, రాయగడ, నవరంగ్పూర్, మల్కాన్గిరి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఏకధాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

బంగాళాఖాతంలో మరో తుఫాన్..
ఇదిలావుండగా.. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడనుంది. ఈశాన్యం, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో ఈ సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడుతుందని పశ్చిమ బెంగాల్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ జీకే దాస్ తెలిపారు. ఇక్కడ ఏర్పడే అల్పపీడనం క్రమంగా తుఫాన్గా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లు చెప్పారు. 29వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు.

దక్షిణ బెంగాల్పై
దీని ప్రభావంతో ఈ నెల 28, 29వ తేదీల్లో పశ్చిమ బెంగాల్ దక్షిణం, తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. కోల్కత, ఉత్తర 24 పరగణ, ఈస్ట్ మేదినిపూర్, వెస్ట్ మేదినిపూర్, ఝార్గ్రామ్, హౌరా, హుగ్లీలపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించినట్లు తెలిపారు. హౌరా, హుగ్లీ, కోల్కతలపై తుఫాన్ ప్రభావం అంచనాలకు మించిన స్థాయిలో ఉండొచ్చని చెప్పారు.
గులాబ్పై హైఅలర్ట్..
కాగా- గులాబ్ తుఫాన్ నేపథ్యంలో.. ఏపీ, ఒడిశా అప్రమత్తం అయ్యాయి. తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించాయి. ఒడిశా తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. ఏడు జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. కేంద్రపారా, గంజాం, గజపతి, కొంధమాల్, రాయగడ, నవరంగ్పూర్, మల్కాన్గిరిల్లోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.

కేంద్రం సైతం అప్రమత్తం
మిగిలిన జిల్లాలపై గులాబ్ తుఫాన్ తీవ్రత ఉంటుందని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ తరహా వాతావరణ పరిస్థితి ఈ నెల చివరి వరకూ కొనసాగడానికి అనుకూల వాతావరణం బంగాళాఖాతంలో నెలకొని ఉందని చెప్పారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను ఆయా రాష్ట్రాలకు తరలించింది.
దీనికి అదనంగా- రాష్ట్రస్థాయి వైపరీత్యాల నిర్వహణ బలగాలు పని చేస్తోన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా ఇప్పటికే స్పష్టం చేశారు. నష్టాన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications