రియల్ కోవిడ్ హీరో.. 1100 మృతదేహాలకు అంత్యక్రియలు.. కూతురు పెళ్లి వాయిదా వేసి మరీ...
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు. అధికారిక లెక్కల కంటే అసలు మరణాల లెక్కలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చునన్న వాదన బలంగా వినిపిస్తోంది. చాలా పట్టణాలు,నగరాల్లో సామూహిక దహనాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్మశానానికి వచ్చే మృతదేహాల సంఖ్య పెరగడంతో అక్కడి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపిస్తున్నాయి. ఈ విషాద పరిస్థితుల్లో ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ అధికారి కూడాకరోనా మృతుల అంత్యక్రియలకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇప్పటివరకూ 1100 మంది కరోనా బాధితుల అంత్యక్రియలకు ఆయన సాయమందించారు.
ఎవరా పోలీస్...
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 56 ఏళ్ల ఏఎస్సై రాకేశ్ కుమార్ కరోనా వేళ మానవత్వం చాటుతున్నారు. కరోనాతో మృతి చెందినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే మానవత్వంతో తానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తన కుమార్తె పెళ్లిని సైతం ఆయన వాయిదా వేయడం గమనార్హం. ఈ విషాద సమయంలో కూతురి పెళ్లి కంటే తన సేవలు సమాజానికి అవసరమని ఆయన చెబుతున్నారు. ఇప్పటివరకూ 1100 మంది కరోనా బాధితుల మృతదేహాలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
అభినందించిన ఢిల్లీ పోలీస్ విభాగం...
ఏఎస్సై రాకేశ్ కుమార్ చేస్తున్న సామాజిక సేవను ఢిల్లీ పోలీస్ విభాగం అభినందించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన 1100 మందికి రాకేశ్ అంత్యక్రియలు నిర్వహించారని... ఇందులో 50 మంది చితికి ఆయనే స్వయంగా నిప్పంటించారని తెలిపింది. కోవిడ్ విధుల కోసం కూతురి పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నారని వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి రాకేశ్ కుమార్ లోధి రోడ్లోని దహన వాటికలో విధులు నిర్వర్తిస్తున్నారు. అంకితభావంతో,మానవతా దృక్పథంతో ఆయన చేస్తున్న సేవలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రియల్ కోవిడ్ హీరో...
ఏఎస్సై రాకేశ్ కుమార్ను నెటిజన్లు రియల్ కోవిడ్ హీరోగా ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సైతం రాకేశ్ కుమార్ సేవలను అభినందించారు. 'కోవిడ్ కాలంలో కొంతమంది నిజమైన హీరోలు పుట్టుకొచ్చారు. అలాంటివారిలో ఏఎస్సై రాకేశ్ కుమార్ అత్యున్నత గౌరవానికి,ప్రోత్సాహానికి అర్హులు. ఈ కష్టకాలంలో రాకేశ్ లాగే సేవలందిస్తున్న ఎంతోమంది అత్యున్నత గౌరవానికి అర్హులు.' అని ట్వీట్ చేశారు. ట్విట్టర్లో చాలామంది నెటిజన్లు ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆయన సేవలు స్పూర్తిదాయకం అని... కుదిరితే ఆయనకు ఎస్సైగా ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Recommended Video

కేజ్రీవాల్ హైలెవల్ మీటింగ్...
ఢిల్లీలో గురువారం(మే 6) మరో 335 మంది కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో ఆక్సిజన్ అందక చనిపోయినవారు కూడా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సర్ గంగారాం ఆస్పత్రిలో 25 మంది,జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది ఆక్సిజన్ అందక చనిపోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నెలకొన్న కరోనా సంక్షోభం,పరిష్కారాలపై ఆయన చర్చించనున్నారు. కరోనా కట్టడి కోసం ఢిల్లీలో ఇప్పటికే లాక్డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications