చికిత్స సమయంలో గర్భిణి మహిళ మృతి..: హత్య కేసు నమోదు, వేదనతో వైద్యురాలు ఆత్మహత్య
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గర్భిణికి చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో.. ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ అర్చనా శర్మ, ఆమె భర్త కలిసి లాల్సోట్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. కాగా, సిజేరియన్ చేస్తుండగా ఓ గర్భిణి సోమవారం మృతి చెందింది. అయితే, వైద్యురాలి నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాలతో తీవ్రంగా మనోవేదనకు గురైన వైద్యురాలు అస్పత్రిపైనే ఉన్న తన నివాసంలో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. తాను నిర్దోషినని చెప్పడానికి తన చావే సాక్ష్యమని, అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని లేఖలో పేర్కొన్నారు వైద్యురాలు అర్చనా శర్మ.
కాగా, ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులను ఆగ్రహానికి గురిచేసింది. ఇందుకు నిరసనగా బుధవారం వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వృత్తిపరమైన విధుల్లో ఉన్నప్పుడు వైద్యులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయరాదిన సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఉందని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ విజయ కపూర్ అన్నారు.
బాధ్యులైన పోలీసు అదికారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వైద్యురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. కాగా, వైద్యురాలికి న్యాయం చేయాలంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకన్నారు.
కాగా, కేసులో సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని డివిజన్ కమిషనర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం పేర్కొన్నారు. రోగుల ప్రాణాలను కాపాడటం కోసం డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ, ఇలాంటి దురదృష్ణకర సంఘటనలు జరిగినప్పుడు వారిని నిందించడం సమంజసం కాదని అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.