కాంగ్రెస్ బిగ్ డైలామా : ఐదు దశాబ్దాలు... సక్సెస్ఫుల్ నాన్ గాంధీ ప్రెసిడెంట్ ఆయనొక్కరే...
గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. వారం లోగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటుందని అంతా భావించారు. కానీ ఏడాది గడిచినా కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మధ్యంతర బాధ్యతలు చేపట్టినా... వయోభారం రీత్యా ఇక ఆమె శక్తి సరిపోవట్లేదు.
Recommended Video
ఇదే క్రమంలో 23 మంది కాంగ్రెస్కి అత్యంత విధేయులు,సీనియర్లు అయిన నేతలు పార్టీలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందంటూ లేఖ రాయడంతో 'నాయకత్వ' మార్పుపై వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దీంతో పగ్గాలు మళ్లీ గాంధీ కుటుంబానికి వస్తాయా... లేక గాంధీయేతరులకు దక్కుతాయా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఐదు దశాబ్దాల క్రితం...
గాంధీయేతర నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచి పూర్తి స్థాయి అధికారాన్ని అనుభవించింది దాదాపు ఐదు దశాబ్దాల క్రితం. 1971లో జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అది సాధ్యపడింది. ఆ తర్వాత 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నాన్-గాంధీ నాయకత్వంలోనే(దేవకాంత బరూహ్) బరిలో దిగి ఓటమిపాలైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ కేవలం మరో ఇద్దరు నాన్-గాంధీలు మాత్రమే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ ఇద్దరిలో ఒకరు పీవీ నరసింహారావు కాగా మరొకరు సీతారాం కేసరి.
19 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో సోనియా...
సీతారం కేసరి తర్వాత 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం 19ఏళ్ల (1998-2017) పాటు ఆమె పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా కొనసాగారు. 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ... సోనియా గాంధీ ప్రచార ర్యాలీలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలా పార్టీలో ఆమె నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడింది. 2004లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ సోనియా నాయకత్వంలో బీజేపీని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చింది. నిజానికి బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయే ఓడిపోతుందని అప్పట్లో అతికొద్దిమంది విశ్లేషకులు మాత్రమే అంచనా వేయగలిగారు. సోనియా నాయకత్వం వాజ్పేయి నాయకత్వాన్ని ఎదుర్కొనలేదన్న చాలామంది విశ్లేషకుల పరిశీలన తలకిందులైంది. ఆ ఎన్నికల్లో యూపీఏ విజయం పూర్తిగా సోనియా ఖాతాలోకే వెళ్లింది.
2014లో అధికారానికి దూరం...
2004లో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా కొనసాగించిన కాంగ్రెస్... ఆ ఐదేళ్ల కాలంలో 2జీ స్కామ్ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి 2009లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పర్యాయాలు సోనియా కేవలం పార్టీ నాయకత్వానికే పరిమితమై... ప్రధానిగా మన్మోహన్ సింగ్కు అవకాశమిచ్చారు. అలా దాదాపు పదేళ్ల పాటు విజయవంతంగా అధికారంలో కొనసాగింది. అయితే సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న నేపథ్యంలో సహజంగానే వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకత,దానికి తోడు నరేంద్ర మోదీ వేవ్తో కాంగ్రెస్ 2014లో అధికారానికి దూరమైంది.
వెంటాడుతున్న కష్టాలు...
2017లో సోనియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కాంగ్రెస్కు కష్టాలు మొదలయ్యాయి. రాహుల్ ఆ బాధ్యతలను భర్తీ చేసినప్పటికీ నాయకుడిగా నిరూపించుకోవడంలో విఫలమవుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. అంతేకాదు,ఎన్నికల్లో తాను ఒంటరిగా పోరాడానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సీనియర్లలో అసంతృప్తి గూడుకట్టుకునేలా చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సోనియానే పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ... ఇప్పుడు వయోభారం రీత్యా ఆమె తప్పుకునే పరిస్థితి తలెత్తింది.
ఈసారి అవకాశం ఎవరికి...?
ఎన్నికల ముందు తాను ప్రధాని కావాలని కలలు గన్న రాహుల్... పార్టీ ఓటమితో తనకు పదవులు ముఖ్యం కాదని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు,కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా గాంధీయేతరుడినే నియమించాలని ఆయన కోరారు. ఇటీవల ప్రియాంక గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోవైపు పార్టీ సీనియర్లు మాత్రం సమూల మార్పులు అవసరం అంటున్నారు. అయితే ఇప్పటికీ రాహుల్ గాంధీ నాయకత్వం వైపే మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు మొగ్గుచూపుతున్నారు. అంతకుముందు,సోనియా మధ్యంతర బాధ్యతలు చేపట్టిన సమయంలో మన్మోహన్ సింగ్,ఏకే ఆంటోనీ,ముకుల్ వస్నిక్ పేర్లు కూడా ఆ రేసులో వినిపించాయి. కానీ చివరకు సోనియానే తిరిగి బాధ్యతలు చేపట్టారు.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్లో నాయకత్వ డైలామాను చివరకు ఎలా ముగిస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.