వెన్నులో వణుకు పుట్టిస్తోన్న 'తలలేని మొండెం'..
చెన్నై : కంటి మీద కునుకు లేదు.. కునుకు తీద్దామన్నా..! నిద్రలోను ఉలిక్కి పడుతున్నారు. విషయం గుర్తొస్తే వెన్నులో వణుకు పుట్టడమే కాదు, దినదిన గండంగా సాగుతోంది అక్కడి ప్రజల పరిస్థితి. మూఢ నమ్మకాలు మనిషిని ఎంత అంధకారంలోకి నెట్టేస్తాయో చెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ లేదు. ఏ ఆధారమూ లేని ఓ కల్పిత భ్రమకు ఇప్పుడా ఊరి జనం చచ్చేంత భయపడుతున్నారు.
అసలు విషయమేంటంటే.. వేలూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని పత్తాపేటలో ఓ పుకారు విపరీతంగా షికారు చేస్తోంది. 'తలలేని మొండెం' రాత్రి పూట గ్రామంలో సంచరిస్తుందన్నది ఆ పుకారు సారాంశం. ఇంకేముంది జనాలంతా తల లేని మొండెంను పట్టుకుందామని కాపు కాయడం.. రాత్రుళ్లు నిద్రాహారాలు మానేసి బిక్కుబిక్కుమంటూ గడపడం.. ఇప్పుడక్కడ నిత్యకృత్యం అయిపోయింది.
కిటీకీ శబ్డం వినబడ్డా.. చిన్నారుల ఊయల ఏమాత్రం కదిలినా.. అదేదో అతీత శక్తి ప్రమేయమే అన్న భ్రమ అక్కడి జనాల్లో బలంగా నాటుకుపోయింది. రాత్రంతా కాగడాలు పట్టుకుని గస్తీలు తిరగడం, పొద్దున పూట పెరుమాళ్ ఆలయంలో పూజలు చేయించడం వంటి చర్యలతో ఇప్పుడా గ్రామం వార్తల్లోకి ఎక్కింది.
ఇదే క్రమంలో మంగళవారం రాత్రి ఊరి సరిహద్దులో కాటేరి పూజలు కూడా చేయించారు. రాత్రయితే చాలు.. ఇళ్ల ముందు నువ్వుల నూనె దీపాలు వెలిగించి.. తమను కాపాడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ఊరినే విడిచి బంధువులకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఇలాంటి గ్రామాలపై దృష్టి సారిస్తే.. అక్కడి ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు.