ఎయిరిండియా ఫ్లైట్లో ఘోరం: మల, మూత్ర విసర్జన- ఓపెన్గా, ప్రయాణికుల మధ్యే
న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికుల దురుసు ప్రవర్తనకు అడ్డు అదుపు ఉండట్లేదు. కొద్దిరోజులుగా ఈ దుష్పరిణామాలు సంభవిస్తూనే వస్తోన్నాయి. ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్రం పోసిన ఉదంతాన్ని విస్మరించకముందే మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అది కూడా ఎయిరిండియా విమానంలోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొద్దిరోజుల కిందటే- 256 మంది ప్రయాణికులతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. సిబ్బందితో గొడవకు దిగాడు. వారిపై దాడి చేశాడు. ఎయిర్ హోస్టెస్పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా అతను దురుసుగా ప్రవర్తించాడు.

ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి- విమానంలో బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేశాడు. ముంబై-ఢిల్లీ మధ్య నడిచే ఎయిరిండియా విమానం అది. ఓ వ్యక్తి తాను కూర్చున్న సీటుపై మల, మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరిన వెంటనే అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లైట్ కెప్టెన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం నమోదు చేశారు.
ఈ నెల 24వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐసీ 866లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో సీటు నంబర్ 17లో కూర్చున్న ప్రయాణికుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సీట్పై మల, మూత్ర విసర్జన చేయడం, ఉమ్మి వేయడం, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తోటి ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు. క్యాబిన్ సూపర్వైజర్పై బూతులతో విరుచుకుపడ్డాడు.
ఈ విషయాన్ని ఫ్లైట్ కెప్టెన్కు తెలియజేయడంతో ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా సెక్యూరిటీ చీఫ్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications