గురుద్వార వద్ద పాకిస్తానీ మోడల్ రచ్చ రచ్చ: క్షమాపణలు చెప్పేంత వరకూ వదలని సిక్కులు
న్యూఢిల్లీ: కర్తార్పూర్.. పాకిస్తాన్లోసి పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. సిక్కులు ఆరాధించే గురు నానక్ బోధనలను సాగించిన స్థలంగా భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా కర్తార్పూర్ గురుద్వార దర్బార్ సాహిబ్ను సందర్శించాలని కోరుకుంటుంటారు. అలాంటి గురుద్వార ఆవరణలో పాకిస్తాన్కు చెందిన మోడల్ సౌలెహా ఫొటోషూట్ చేశారు. కర్తార్పూర్ గురుద్వార వద్ద ఆ మోడల్ ఓ కమర్షియల్ ఫిల్మ్ కోసం ఈ ఫొటోషూట్ను చేశారు. మన్నత్ క్లాతింగ్ అనే సంస్థ బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి ఈ ఫొటో షూట్ చేశారు.
దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్పింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్ర దుమారానికి దారి తీసిందా ఫొటో షూట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది సిక్కుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురుద్వారాలో అడుగు పెట్టిన ప్రతి వ్యక్తీ సంప్రదాయబద్ధమైన తలపాగాను ధరించడమో లేక తలను కవర్ చేసే దుస్తులను ధరించమో చేస్తారని.. అలాంటివేవీ లేకుండా గురుద్వారలో అడుగు పెట్టడం, అక్కడి పవిత్రతను మంటగలిపేలా ఫొటోషూట్ చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు.
ఢిల్లీ సిక్ గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి మన్జీందర్ సింగ్ సిర్సా దీనిపై స్పందించారు. పవిత్రమైన గురుద్వారను అపవిత్రం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ ఫొటో షూట్ కోసం తాము ఆరాధించే గురు నానక్ స్థాపించిన గురుద్వార దర్బార్ను ఎంచుకోవడం పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి ట్యాగ్ చేశారు.
దీనిపై విమర్శలు రావడంతో పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి రంగంలోకి దిగారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి చర్యలను సమర్థించలేమని స్పష్టం చేశారు. సమగ్ర నివేదికను అందజేయాలంటూ స్థానిక అధికారులను ఆదేశించారు. ఇలాంటి చర్యలు ఎవరు చేసిన ప్రోత్సహించబోమని వ్యాఖ్యానించారు. కర్తార్పూర్ కారిడార్ అంశం రెండు దేశాలకు సంబంధించినదని, అలాంటి చోట కమర్షియల్ ఫిల్మ్స్ షూటింగ్కు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు.
Modelling bareheaded for ladies' attire, in the premises of Gurdwara Sri Darbar Sahib at #KartarpurSahib in Pakistan, by a Lahorite woman, has several hurt the religious sentiments of Sikhs. Further the pictures were uploaded on social media.@ImranKhanPTI @MORAisbOfficial pic.twitter.com/i5RX01kWGo
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) November 29, 2021
ఈ స్థాయిలో దుమారం చెలరేగడంతో మోడల్ సౌలెహ స్పందించారు. క్షమాపణలు కోరారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో దీన్ని పోస్ట్ చేశారు. తాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోలు కమర్షియల్ ఫిల్మ్ షూటింగ్ కోసమో.. లేక మరేదైనా మోడలింగ్ కోసమో ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు. కర్తార్పూర్ గురుద్వార మీద ఉన్న ఆసక్తితో ఇటీవలే తాను అక్కడికి వెళ్లానని, క్యాజువల్గా ఈ ఫొటోలను తీసుకున్నామని అన్నారు. ఎవ్వరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
Such behaviour & act at pious place of Sri Guru Nanak Dev Ji is totally unacceptable!
— Manjinder Singh Sirsa (@mssirsa) November 29, 2021
Can she dare to do the same at her religious place in Pakistan?@ImranKhanPTI @GovtofPakistan shd tk immed action to stop this trend of treating Sri Kartarpur Sahib as picnic spot by Pak people pic.twitter.com/AwyIkmqgbC
అటు మన్నత్ క్లాతింగ్ సంస్థ కూడా రెస్పాండ్ అయింది. తాము ఉద్దేశపూరకంగా ఈ ఫొటోషూట్ చేయలేదని తెలిపింది. థర్డ్ పార్టీ ద్వారా అందిన సౌలేహ ఫొటోలను తాము బ్రాండింగ్ను ప్రమోట్ చేసుకోవడానికి వినియోగించుకున్నామని వివరణ ఇచ్చింది. ఆ ఫొటోలను తొలగిస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్ ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ ఉస్మాన్ బుజ్దార్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ చర్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.