అన్ని పథకాలకు అమ్మ పేరే: జయపై హైకోర్టులో పిల్
ముధురై: తమిళనాడులో అన్నీ అమ్మ పేరిట పథకాలు వస్తున్నాయని ఆరోపిస్తూ మద్రాసు హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అన్ని పథకాలకు ముందు అమ్మ అని తగిలిస్తున్నారని పిల్ లో ఆరోపించారు.
తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల పేర్లకు ముందు అమ్మ, విప్లవాత్మక నేత (పురుచ్చి తలైవి) అని చేర్చడం, ఆపేరిట ప్రకటనలు ప్రచురించి ఫ్రీగా వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది పీ. రథినం మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇక ముందు అలాంటి ప్రకటనలు (అమ్మ పథకాలు) చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని పిల్ లో మనవి చేశారు. అదేవిధంగా ప్రజల సొమ్మును వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా చూడాలని మనవి చేశారు.
అమ్మా కాల్ సెంటర్, అమ్మా మైక్రో లోన్స్ పేరిట ప్రతి రోజూ దిన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి వేల కోట్ల రుపాయలు వృదా చేస్తున్నారని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో వివరించారు. ప్రజల సొమ్ముతో అమ్మ పేరిట ప్రచారం చేసుకుంటూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని పిల్ లో ఆరోపించారు.