కంగనా రనౌత్ సోషల్ మీడియా పోస్టులకూ సెన్సార్ కత్తెర: సుప్రీంలో పిటీషన్: అశాంతికి కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఆమె చేస్తోన్న పోస్టులు, కామెంట్లు.. దేశంలో అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కారణమౌతోందంటూ పిటీషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశాలపై కంగనా చేస్తోన్న వ్యాఖ్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వివాదాలను వెంటేసుకుని..
వివాదాస్పద నటిగా గుర్తింపు పొందారు కంగనా రనౌత్. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోన్నారు. 2014 తరువాతే దేశానికి అసలైన స్వాతంత్య్రం సిద్ధించిందంటూ కొద్దిరోజుల కిందటే కంగనా చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. 2014 తరువాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యం. జాతిపిత మహాత్మగాంధీ సహా స్వాతంత్య్ర సమర యోధులను ఆమె అవమానించిందంటూ ఒకట్రెండు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.

బీజేపీ సానుభూతిపరురాలిగా..
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సానుభూతిపరురాలిగా కంగనా రనౌత్ పేరు తెచ్చుకున్నారు. దీనికి అనుగుణంగానే అవకాశం వచ్చిన ప్రతీసారీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ఆకాశానికెత్తేస్తుంటారు. బహిరంగ కార్యక్రమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా.. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ పోస్టులు చేస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలను ఆమె తుకడే గ్యాంగ్గా అభివర్ణిస్తుంటారు.

ముంబైపైనా
ఫేస్బుక్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కంగనా రనౌత్ యాక్టివ్గా ఉంటారు. వీడియోలు, పోస్టుల రూపంలో తన అభిప్రాయాలను వాటి ద్వారా పంచుకుంటూంటారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమిని ఉద్దేశించి ఇదివరకు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ముంబైని పాకిస్తాన్తో పోల్చారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన రోజు కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారామె.

ఖలిస్తాన్ ఉగ్రవాదులతో..
సిక్కులను ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చారు. విదేశాల్లో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు రైతుల ఉద్యమాన్ని నడిపించారంటూ వ్యాఖ్యానించారు. సిక్కులను ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడంపై ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిక్కులను దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చితకబాదారని.. దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సిక్కులు ఆమెపై మండిపడ్డారు. తన అభిప్రాయాలను వ్యతిరేకించిన కొందరు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ తాజాగా బాంబు పేల్చారు. పంజాబ్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, తనను బెదిరించిన వ్యక్తిపై అరెస్ట్ చేయాలంటూ ఆమె ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున.. అతనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సోనియాగాంధీదేనని అన్నారు.
Recommended Video

సెన్సార్ చేయండి..
సోషల్ మీడియాలో ఆమె చేస్తోన్న ఈ వ్యాఖ్యలన్నీ దేశంలో అశాంతియుత వాతావరణానికి కారణమౌతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. కంగనా చేస్తోన్న కామెంట్లు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. సిక్కులపై ఆమె చేసిన వ్యాఖ్యాలను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. సోషల్ మీడియాను నియంత్రించడానికి ఉద్దేశించిన చట్టాలకు అనుగుణంగా కంగనా పోస్టులను సెన్సార్ చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications