గుజరాత్ ఎన్నికలవేళ కాంగ్రెస్కు వరుస షాకులు; 2రోజుల్లో బీజేపీ బాటలో ముగ్గురు కీలక ఎమ్మెల్యేలు!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగులుతోంది. వరుసగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపి గూటికి చేరుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుండి బలమైన కేడర్ ను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపివైపు క్యూ కట్టారు.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్న ఎమ్మెల్యేలు .. షాక్ లో కాంగ్రెస్
ఇక తాజాగా కాంగ్రెస్కు తగిలిన మరో షాక్ లో గిర్ సోమనాథ్ జిల్లా తలాలా నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ కాంగ్రెస్ పార్టీకి మరియు గుజరాత్ అసెంబ్లీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక ఝలోద్ నియోజకవర్గం నుండి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే భవేష్ కటారా కూడా గుజరాత్ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్ సంఖ్య 59కి తగ్గింది. ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడిన ఝలోద్ అభ్యర్థిగా డాక్టర్ మితేష్ గరాసియాను కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భవిష్ కటారా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

గిర్ సోమనాథ్ జిల్లాలో బలమైన నాయకుడు బరాద్.. కాంగ్రెస్ కు నష్టం
గిర్ సోమనాథ్ జిల్లాలోని తలాలా ప్రాంతానికి చెందిన , స్థానికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న బరాద్, 63, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 31,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఆయన అహిర్ కమ్యూనిటీకి చెందినవాడు. ఇది సౌరాష్ట్ర ప్రాంతంలో ఎన్నికలపరంగా చాలా కీలకమైంది గా పరిగణించబడుతుంది. బరాద్ తండ్రి ధనభాయ్ మరియు సోదరుడు జాషుభాయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం నుండి వచ్చిన బరాద్ చాలా తర్జనభర్జనల తర్వాత బీజేపీలో చేరానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మోహన్సిన్హ్ రత్వా
ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి యాత్ర లో తాను భాగస్వామ్యం తీసుకునేందుకు బీజేపీలో చేరుతున్నానని, పార్టీ ఏ పని ఇచ్చినా నెరవేరుస్తానని బరాద్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గిర్ సోమనాథ్, జునాగఢ్ జిల్లాల్లోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించేలా కృషి చేస్తానని అన్నారు.ఇప్పటికే ఆ పార్టీ నుంచి పది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ సిన్హ రత్వాను బిజెపి తన గూట్లో చేర్చుకుంది.

చోటా ఉదయపూర్ లో కాంగ్రెస్ కు షాక్
చోటా ఉదయపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రత్వా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత అయిన మోహన్సిన్హ్ రత్వాకు గిరిజన ఓటు బ్యాంకు మీద మంచి పట్టు ఉంది. చోట ఉదయపూర్ స్థానాన్ని తన కుమారుడు రాజేంద్రసిన్హ్ రత్వాకు కేటాయించాలని, కానీ ఈసారి పోటీ చేయబోనని ఆయన అధిష్టానాన్ని కోరినప్పటికీ, ఎంపీ నరన్ రత్వా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మోహన్ సిన్హ్ రత్వా రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications