అమ్మ తనానికి మచ్చ: నాలుగేళ్ల కూతుర్ని 4వ అంతస్తుపై నుంచి విసిరేసింది (వీడియో)
బెంగళూరు: ఓ మహిళ అమ్మతనానికి మచ్చతెచ్చింది. నాలుగేళ్ల కన్న కూతురుని.. నాలుగో అంతస్థు నుంచి కింద పడేసి చంపింది.ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని సంపంగి రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది.సుష్మా భరద్వాజ్ అనే మహిళ డెంటిస్టుగా పనిచేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కూతురుంది.
అయితే, ఆ పాపకు మాటలు రాకపోవడంతోపాటు మానసికంగానూ ఎదుగుదల లేదు. దీంతో దివ్యాంగురాలైన ఆ పాపను చూసుకోవడం సుష్మాకు కష్టంగా మారింది. ఇది తన కెరీర్కు సమస్యగా మారిందని ఆమె భావించింది. ఈ క్రమంలోనే తను నివాసం ఉంటున్న అపార్టుమెంట్లోని నాలుగో ఫ్లోర్ నుంచి పాపను కిందకు పడేసింది.
A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx
— IANS (@ians_india) August 5, 2022
ఆ తర్వాత తను కూడా కిందకు దూకే ప్రయత్నం చేసి ఆగిపోయింది. ఈలోపే కుటుంబసభ్యులు వచ్చి ఆమెను రక్షించారు. నాలుగో అంతస్థు నుంచి కింద పడటంతో పాప అక్కడికక్కడే చనిపోయింది. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుష్మపై కేసు నమోదు చేశారు.
సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి మహిళను నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు. గతంలో కూడా తన కూతురును సుష్మ రైల్వే స్టేషన్లో వదిలేసేందుకు ప్రయత్నించింది. తర్వాత మహిళ భర్త ఆ పాపను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇలాంటి తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.