సిద్ధరామయ్య రాజీనామా ఆమోదం: గోధూళి ముహూర్తంలో డీకే శివకుమార్ పట్టాభిషేకం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే లోక్ భవన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించింది. రాజ్యాంగబద్ధంగా ఈ రాజీనామాను అంగీకరించినట్లు లోక్ భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సిద్ధరామయ్య మరో రెండు, మూడు రోజులు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
వాస్తవానికి, గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ బెంగళూరులో అందుబాటులో లేని కారణంగా సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామా పత్రం ఆమోదం పొందడంలో జాప్యం ఏర్పడింది. అత్యవసర కుటుంబ పనుల నిమిత్తం గవర్నర్ తన స్వస్థలం మధ్యప్రదేశ్ లోని నాగ్డాకు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోక్ భవన్ లో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ కు సమర్పించారు.

కార్యదర్శులు ఆ లేఖను స్వీకరించినా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ స్వయంగా ఆమోదించాల్సి ఉంటుంది. నాగ్డా నుండి గవర్నర్ ఈ వేకువ జామున బెంగళూరుకు చేరుకున్నారు. సిద్ధరామయ్య రాజీనామా పత్రాన్ని ఆమోదించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. శనివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో డీకే శివకుమార్ సీఎల్పీ నేతగా ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
సోమవారం సాయంత్రం గోధూళి ముహూర్తంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లోక్ భవన్లో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిణామంతో కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.గోధూళి ముహూర్తం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. సూర్యాస్తమయం నుంచి చీకటి కమ్మే లోపు, సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య ఉండే కాలాన్నే గోధూళి అంటారు.
ఈ సమయంలో ఆవులు తమ ఇళ్లకు తిరిగి వస్తాయి, కాబట్టి ఇది లక్ష్మీదేవి ఆగమనం జరిగే శుభ సమయంగా భావిస్తారు. గోధూళి సమయంలో పక్షులు, ఇతర జీవులు తమ నివాసాలకు చేరుకుంటాయి. ఆకాశంలో ఆనందంగా ఎగిరే పక్షుల వరుసలు, ఉత్సాహభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సమయానికి మరింత శోభను తెస్తాయి. శుభకార్యాలకు గోధూళి ముహూర్తం శుభప్రదం. ఈ పవిత్ర సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications