ఆధార్ ఉంటే భారతీయుడు కాదా? సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసే 'ఆధార్' కార్డుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆధార్ కార్డును కేవలం వ్యక్తిగత గుర్తింపు (Identity Verification) కోసమే పరిమితం చేయాలని, దానిని పౌరసత్వం (Citizenship), స్థానికత (Domicile), లేదా శాశ్వత నివాస ధృవీకరణగా పరిగణించరాదంటూ దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక అడుగు వేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (UTs) చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
చట్టం ఏం చెబుతోంది? పిటిషనర్ అభ్యంతరం ఇదే!
ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తరఫున అద్వకేట్ అశ్విని దూబే దాఖలు చేసిన ఈ పిల్ (PIL) లో ఆధార్ చట్టంలోని లొసుగులను ఎత్తిచూపారు. "ఆధార్ చట్టం-2016 లోని సెక్షన్ 9 స్పష్టంగా చెబుతోంది.. 'ఆధార్ అనేది పౌరసత్వానికి లేదా స్థానికతకు నిరూపణ కాదు'. అలాగే, ఆగస్టు 22, 2023 నాటి యూఐడీఏఐ నోటిఫికేషన్ కూడా ఆధార్ను కేవలం గుర్తింపు పత్రంగానే పేర్కొంది తప్ప, బర్త్ సర్టిఫికెట్ లేదా నివాస ధృవీకరణ పత్రం కాదని స్పష్టం చేసింది" అని పిటిషన్లో పేర్కొన్నారు.

అయినప్పటికీ.. స్కూల్ అడ్మిషన్లు, ఆస్తుల కొనుగోళ్లు, జనన ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సుల జారీలో ఆధార్ను ఏజ్, పౌరసత్వ నిరూపణగా విచ్చలవిడిగా వాడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
ఓటర్ల జాబితాలోకి అక్రమ వలసదారులు?
అన్నిటికంటే ముఖ్యంగా, కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే 'ఫామ్-6' (Form-6) దరఖాస్తులో ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్, నివాస ధృవీకరణగా ఆమోదించడంపై పిటిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం (RPA 1950) లోని సెక్షన్ 23(4) మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు పూర్తి విరుద్ధమని వాదించారు.
ప్రస్తుతం ఉన్న ఫామ్-6 వెరిఫికేషన్ విధానం అత్యంత బలహీనంగా ఉందని, సరైన ఆధారాలు లేని వారు కూడా దీని ద్వారా ఓటర్ల జాబితాలోకి చేరిపోతున్నారని పేర్కొన్నారు. ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని విదేశీ చొరబాటుదారులు, అక్రమ వలసదారులు దేశంలో ఆధార్ కార్డులు పొంది, వాటి ద్వారా ఓటర్లుగా నమోదవుతూ భారత పౌరులుగా చలామణీ అవుతున్నారని ధ్వజమెత్తారు.
ఉన్నత స్థాయి కమిటీతో సంస్కరణలు చేపట్టాలి
ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల గుర్తింపు, వెరిఫికేషన్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ అభ్యర్థించారు. దేశ భద్రత, ఓటింగ్ వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు గాను.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సైబర్ సెక్యూరిటీ - ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ద్వారా ఎన్నికల సంస్కరణలు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు బెంచ్, దీనిని ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇలాంటి ఇతర కేసులతో జత చేసింది.














Click it and Unblock the Notifications