పాత గురువు హజారేతో ఆప్ నేతల చర్చలు
రాలేగావ్ సిద్ధి: అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు వారి పాత గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారేని కలిశారు. ఆప్ నేతలు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ మంగళవారం అన్నా హజారేని కలిసి చర్చించారు.
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ప్రవేశపెట్టిన జనలోక్ పాల్ బిల్లు గురించి హజారేకి వివరించారు. జనలోక్ పాల్ బిల్లులోని ముఖ్యాంశాలను హజారేకి వివరించారు. జనలోక్ పాల్ బిల్లుతో అవినీతిని సమర్థవంతంగా అరికడతామని అన్నా హజారేకి హామి ఇచ్చారు.
ఆప్ నేతలు అన్నా హజారేని కలవడంతో రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. ఆప్ నాయకులు అన్నా హజారేని కలిశారని ఆయన అనుచరుడు దత్త అవారి స్పష్టం చేశారు. జనలోక్ పాల్ బిల్లును సోమవారం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
జనలోక్ పాల్ బిల్లును అమలు చెయ్యాలని ఆప్ నేతలు నిర్ణయించారు. 2011లో తయారు చేసిన జనలోక్ పాల్ బిల్లుతో సమానంగా తాము ప్రవేశపెట్టిన బిల్లు ఉంటుందని ఆప్ నేతలు అంటున్నారు. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.