కేజ్రీవాల్కు చిక్కు: 'అసమ్మతి' స్వరాజ్ అభియాన్, వారిపై చర్యలేనా?
న్యూఢిల్లీ: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆరు నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటుదారులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు మంగళవారం ప్రకటించారు. పలు రాష్ట్రాల నుండి మద్దతుదారులు, ఏఏపీ అసమ్మతి నేతలతో మంగళవారం జరిపిన స్వరాజ్ సంవాద్ సమావేశం అనంతరం యోగేంద్ర, ప్రశాంత్లు మాట్లాడారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపర్చడం, దేశవ్యాప్తంగా స్వరాజ్ భావనను స్థాపించడం కోసం స్వరాజ్ అభియాన్ పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ అన్నారు.
ఏఏపీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశానికి వచ్చిన వారిలో 69 శాతం మంది వ్యతిరేకించారు. కొత్త పార్టీ స్థాపనకు కేవలం 25 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపి.. అనంతరం పార్టీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ల పైన కఠిన చర్యలు తప్పేలా కనిపించడం లేదు. బుధవారం ఏఏపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమవుతోంది. స్వరాజ్ సంవాద్ నిర్వహణ నేపథ్యంలో వారి భవిష్యత్తును ఏఏపీ నిర్ణయించనుంది.