గుజరాత్ లో నరేంద్రమోడీ హవాకు బ్రేకులు?
గుజరాత్ లో గత 27 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా దూసుకుపోతున్న భారతీయ జనతాపార్టీ జోరుకు బ్రేక్ లు పడతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లుండగా బీజేపీకి 111, కాంగ్రెస్ పార్టీకి 62 మంది ఉన్నారు. మిగతా 9 సీట్లలో ఇతర పార్టీలవారున్నారు.

15 సంవత్సరాల మోడీ పాలన
27 సంవత్సరాల పరిపాలనా కాలంలో నరేంద్ర మోడీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 111 సీట్లకన్నా ఎక్కువ గెలుచుకుంటేనే నరేంద్రమోడీకి, అమిత్ షాకి సొంత రాష్ట్రంలో వారి హవా నడుస్తున్నట్లు తేలుతుంది. అలా కాకుండా ఆ సంఖ్యకు తక్కువ వస్తే వ్యతిరేకత ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా మ్యాజిక్ ఫిగర్ 92 రావాలి. దేశవ్యాప్తంగా నరేంద్రమోడీపై వ్యతిరేకత పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీజేపీకి ఆశించినస్థాయిలో విజయం దక్కలేదు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ షెడ్యూల్ హిమాచల్ కు ఒక్కదానికే విడుదలైంది. ఈ రాష్ట్రంలో ప్రతిసారి అధికార పార్టీని మార్చి ప్రతిపక్షాన్ని అధికారంలోకి ఎక్కించడం ఇక్కడి ఓటర్లకు అలవాటు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఆ ప్రకారం చూసినా బీజేపీ దీన్ని కోల్పోయే ప్రమాదం కనపడుతోంది.

గుజరాత్ లో నెగ్గాలని ఆప్
గుజరాత్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంది. అయితే పంజాబ్ లో సంచలన విజయాన్ని సాధించిన ఆప్ ఇప్పుడు గుజరాత్, హిమాచలప్రదేశ్ పై దృష్టి సారించింది. గుజరాత్ లో ఆ పార్టీ నేతలు ఉధృతంగా పర్యటిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పర్యటనలో రెండుసార్లు అపశృతి దొర్లింది. విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలు మోడీ, మోడీ అంటూ నినాదాలు చేయగా మరో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన పై నుంచి ఒక ఖాళీ మంచినీళ్ల సీసా విసురుగా వెళ్లింది. గుజరాత్ లో ఆప్ హవా ఉంది కాబట్టే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ నేతలపై తరుచుగా ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోయారని, ఎన్నికల్లో వెనక్కి తగ్గేట్లుగా చేయడానికి దాడులని మండిపడ్డారు. ఆప్ కి రోజురోజుకు గుజరాత్ లో ప్రజాదరణ పెరుగుతోంది.

హిమాచల్ లో కూడా..
ప్రత్యామ్నాయం లేదు కాబట్టే ప్రజలు బీజేపీని ఎన్నుకుంటున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఆప్ కూడా ఇదే పాయింట్ ను లేవనెత్తుతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రకటిస్తోంది. ఆప్ నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. సూరత్ పురపాలక సంఘం ఆప్ ఖాతాలోనే ఉంది. మరికొన్ని పురపాలక సంఘాల్లో ఆప్ కు ప్రాతినిధ్యం ఉంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కంటే ఆప్ నుంచే ఎక్కువ ప్రమాదం పొంచివుండటంతో ఆ పార్టీని టార్గెట్ చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ తోపాటు ప్రకటించాల్సిన గుజరాత్ షెడ్యూల్ ను వాయిదా వేశారని, బీజేపీ నేతలకు అనుకూలంగా షెడ్యూల్ రూపొందించుకున్న తర్వాత ప్రకటిస్తారని ఆప్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. హిమాచల్ లో కూడా ఆప్ రంగంలోకి దిగింది. కాంగ్రెస్, బీజేపీకంటే తమనే ఇక్కడి ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. కొద్దిరోజులు ఓర్పు వహిస్తే విజయం ఎవరిని వరిస్తుందో ఒక స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications