పంజాబ్కు కాబోయే ముఖ్యమంత్రి: ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితుల లిస్ట్
న్యూఢిల్లీ: ఊహించినట్టే- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. తన పరిదిని విస్తరించుకుంది. మొదటిసారిగా ఢిల్లీ గడపను దాటింది. పొరుగునే ఉన్న పంజాబ్లో పాగా వేసింది. భారీ ఆధిక్యతలో దూసుకెళ్తోందా పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిపోయేలా అసెంబ్లీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పరిణామాలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
Recommended Video
పంజాబ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 117. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 59. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అలవోకగా అందుకుంది. 92 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించింది. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆమ్ ఆద్మీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీల్లాంటి నాయకులు కూడా తేలిపోయారు. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ ఛన్నీ.. తాను పోటీ చేసిన రెండో చోట్లా పరాజయం పాలయ్యారు.
భదౌర్, చామ్కౌర్ సాహిబ్ నియోజకవర్గాల్లో చరణ్జీత్ సింగ్ ఛన్నీ పోటీ చేశారు. అయినప్పటికీ- విజయం ముఖం చాటేసింది. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఘోరంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. భదౌర్లో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ వుగోకే, చామ్కౌర్ సాహిబ్లో ఆప్కే చెందిన చరణ్జీత్ చేతిలో ఓడిపోయారు ఛన్నీ. అటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం పరాజయం పలకరించింది.
సిద్ధు పోటీ చేసిన అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థిని జీవన్ జ్యోత్ కౌర్ ఘన విజయాన్ని అందుకున్నారు. ఆమె తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఓ సామాన్య వలంటీర్ ఆమె. మరోవంక- కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు వారెవరూ నిలవలేకపోయారు. పలువురు మంత్రులు ఓటమిబాట పట్టారు.
ఇక ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్.. ధురి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఆయనను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించడంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ సగం విజయం సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. క్లీన్ చిట్ పొలిటీషియన్గా పేరుందాయనకు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఢిల్లీ మోడల్ ప్రభుత్వాన్ని పంజాబ్కు తీసుకొస్తామంటూ ఆయన చేసిన ప్రచారం లాభించింది.
ఇవ్వాళ భగవంత్ మాన్.. ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలుసుకోనున్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చిన నేపథ్యంలో ఆయన మర్యాదపూరకంగా కేజ్రీవాల్తో భేటీ కానున్నారు. అలాగే- ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయంపై ఓ జాబితాను సిద్ధం చేస్తారు. భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పథకాల అమలుపై చర్చిస్తారు.