అబ్ తక్ 113: పాతికేళ్ల సర్వీస్.. వంద ఎన్కౌంటర్లు! మాఫియానే వణికించిన అధికారి
ఆ పోలీస్ అధికారి వయసు 55 ఏళ్లు. తన పాతికేళ్ల సర్వీసులో 100 ఎన్కౌంటర్ లు చేసి, 113 మంది గ్యాంగ్స్టర్లను ఏరివేశారు.
ముంబై: ఆ పోలీస్ అధికారి వయసు 55 ఏళ్లు. తన పాతికేళ్ల సర్వీసులో 100 ఎన్కౌంటర్ లు చేసి, 113 మంది గ్యాంగ్స్టర్లను ఏరివేశారు. ఇది ప్రదీప్ శర్మ ట్రాక్ రికార్డు. ఈయన కథ ప్రేరణతోనే బాలీవుడ్ లో 'అబ్ తక్ చప్పన్' అనే ఓ సినిమా కూడా వచ్చింది.
ఈ హాంకాంగ్ 'పోకిరి'.. 299 మంది గ్యాంగ్స్టర్లను పట్టించాడు!
అయితే తర్వాతి కాలంలో.. గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపాడన్న ఆరోపణల నడుమ ప్రదీప్ శర్మ కూడా కొన్నాళ్లపాటు ఖాకీ చొక్కాకు దూరమయ్యారు. చివరకు ఆ ఆరోపణలు, నిందల నుంచి బయటపడటంతో ఇప్పుడు విధుల్లో చేరేందుకు సిద్ధమైపోతున్నారు.. మన సూపర్ కాప్.
టీచర్ అవ్వాలనుకుని.. పోలీస్ ఆఫీసరై..
మహారాష్ట్రలోని ధులే జిల్లా అగ్ర ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో ప్రదీశ్ శర్మ జన్మించారు. తన తండ్రిలాగే తాను కూడా టీచర్ అవ్వాలని కలలు కన్న శర్మ చివరకు పోలీసాఫీసర్ అయ్యారు. 1983 మహారాష్ట్ర పోలీస్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఈయన బ్యాచ్ లోనే రవింద్ర అంగ్రే, అస్లాం మోమిన్ లాంటి వివాదాస్పద ఆఫీసర్లు కూడా ఉన్నారు.
దూకుడు స్వభావంతో పైఅధికారుల దృష్టిలో...
మహిం పోలీస్ స్టేషన్ లో తొలిసారి బాధ్యతలు స్వీకరించారు ప్రదీప్ శర్మ. యువకుడు, పైగా దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కావటంతో పైఅధికారుల దృష్టిలో పడ్డారు. కొద్దికాలానికే జూహు స్పెషల్ బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ మీద వెళ్లారు.
Recommended Video
1993లో మొదలైన వేట...
మే 6, 1993 లో ఏకే-56 ఆయుధాల స్పెషలిస్ట్ సుభాష్ మకద్వాలా ఎన్ కౌంటర్తో ప్రదీప్ శర్మ తన వేట ప్రారంభించారు. అక్కడ నుంచి గ్యాంగ్స్టర్ల భరతం పట్టే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో లష్కర్-ఈ-తైబ సానుభూతిపరులను కూడా ఆయన వదిలిపెట్టలేదు. క్రమక్రమంగా ఆయన పేరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా మారిపోయింది.
అండర్ వరల్డ్ పై కన్ను...
ప్రదీప్ శర్మ దృష్టంతా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం అనుచరుల మీద పడింది. ఎన్కౌంటర్ లలో వారిని చంపేసుకుంటూ పోసాగారు. 2000 సంవత్సరంలో తన ఇన్ఫార్మర్ ఓపీ సింగ్ ను ఛోటా రాజన్ హత్య చేయటంతో ప్రదీప్ కు మండిపోయింది. అంతే అక్కడి నుంచి ఛోటారాజన్కు నిద్రలేకుండా చేశారాయన. అనుచరుల్ని ఒక్కోక్కర్నీ ఏరేసుకుంటూ వెళ్లటంతో ఛోటారాజన్ ఉక్కిరిబిక్కిరై ఒకానొక సమయంలో కాళ్ల బేరానికి వచ్చాడు. చైనాకు ఎర్రచంద్రనం స్మగ్లింగ్ కేసు, నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఆయుధాల స్వాధీనం తదితర కేసులన్నీ ప్రదీప్ శర్మ ఖాతాలోనే ఉన్నాయి.
ఆరోపణలు.. అరెస్ట్... వేటు
2006లో రామ్ నారాయణ్ ఎన్ కౌంటర్ కావటం, అందులో దావూద్ గ్యాంగ్ కు ప్రదీప్ శర్మ సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో ఆయనపై వేటు పడింది. ముందు కంట్రోల్ రూం నుంచి ధారావి స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం ఆగష్టు 30, 2008 లో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2010లో ఈ ఫేక్ ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించి 21 మంది పోలీసాఫీసర్లను అరెస్ట్ చేయగా, వారిలో ప్రదీప్ శర్మ కూడా ఉన్నారు.
నిర్దోషిగా విడుదలై... విధుల్లోకి
రామ్ నారాయణ్ ఎన్ కౌంటర్ కేసులో 13 మంది అధికారులను జూలై 2013 లో ముంబై స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించగా, ప్రదీప్ శర్మ మాత్రం నిర్దొషిగా విడుదలయ్యారు. కానీ, కేసులో ఆయన పాత్రపై ఇంకా హైకోర్టు లో కేసు నడుస్తున్నండటంతో డిపార్ట్ మెంట్ లో ఆయన పునర్నియామకంపై పోలీస్ శాఖ వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో వచ్చే వారమే ఆయన థానే పోలీస్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రదీప్ శర్మ పదవీకాలం 2018తో ముగియనుంది. గతేడాది ఇదే రీతిలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ నుతిరిగి విధుల్లోకి తీసుకుంది. మొత్తానికి ప్రదీప్ శర్మ తిరిగి విధుల్లోకి చేరుతుండడంతో.. ముంబైలోని గ్యాంగ్ స్టర్లలో మళ్లీ వణుకు మొదలైంది.