పోలీసుల చేతికి 'అభిజ్ఞాన్' అస్త్రం.. 35 సెకన్లలోనే నేరచరిత్ర బయట!
ఇకపై రోడ్లపై అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, వాహన తనిఖీల్లో దొరికిన కరుడుగట్టిన నేరస్థులు పోలీసుల కళ్లెదుట నకిలీ పేర్లు, తప్పుడు అడ్రస్లతో తప్పించుకోవడం అసాధ్యం కానుంది! ఎందుకంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తాజాగా ప్రారంభమైన 'అభిజ్ఞాన్’ (Abhigyan) యాప్ దేశవ్యాప్తంగా నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రూపకల్పన చేసిన ఈ వినూత్న యాప్, హ్యాండ్హెల్డ్ (పోర్టబుల్) బయోమెట్రిక్ స్కానర్ల సాయంతో పోలీసులు ఇకపై వీధుల్లోనే నిందితుల వేలిముద్రలను సేకరించి, వారి నేరచరిత్రను క్షణాల్లో స్క్రీన్పై చూడవచ్చు.
1.3 కోట్ల క్రిమినల్స్ డేటాతో లింక్.. 35 సెకన్లలోనే మ్యాచ్!
ఈ 'అభిజ్ఞాన్' యాప్ నేరుగా దేశవ్యాప్తంగా ఉన్న 'నాఫిస్' (NAFIS - National Automated Fingerprint Identification System) కేంద్రీకృత డేటాబేస్తో అటాచ్ అయింది. ఈ డేటాబేస్లో దేశంలోని సుమారు 1.3 కోట్ల మంది అనుమానిత నేరగాళ్లు, శిక్షపడిన ఖైదీల వేలిముద్రల రికార్డులు భద్రపరిచారు. క్షేత్రస్థాయిలో ఉండే ఒక పోలీస్ అధికారి తన వద్ద ఉన్న చిన్న పోర్టబుల్ స్కానర్ ద్వారా ఒక వ్యక్తి బొటనవేలి ముద్రను సేకరించిన కేవలం 35 సెకన్లలోనే 'నాఫిస్' డేటాబేస్తో సరిపోల్చి, ఆ వ్యక్తికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో యాప్ స్పష్టం చేస్తుంది.

ప్రస్తుతం ఈ వేలిముద్రల తనిఖీ సదుపాయం దేశవ్యాప్తంగా కేవలం 1,556 జిల్లా కేంద్రాలు, పోలీస్ స్టేషన్లలోని వర్క్స్టేషన్లకే పరిమితమై ఉంది. కానీ, ఈ కొత్త యాప్తో ప్రతి పోలీస్ అధికారి చేతిలోని స్మార్ట్ఫోనే ఒక కదలాడే ఇన్వెస్టిగేషన్ సెంటర్గా మారబోతోంది.
పోలీసులకు లభించే అదనపు రక్షణ
ఈ యాప్ కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాదు, విధుల్లో ఉండే పోలీసుల ప్రాణ రక్షణకు కూడా ఉపయోగపడనుంది. సాధారణంగా రాత్రి సమయాల్లో లేదా రోడ్లపై వెహికల్ చెకింగ్స్ చేసేటప్పుడు ఆయా వ్యక్తులు ఎంతటి ప్రమాదకరమైన నేరగాళ్లో పోలీసులకు ముందే తెలియదు. కానీ, ఈ బయోమెట్రిక్ స్కానింగ్ ద్వారా తనిఖీ చేస్తున్న వ్యక్తి మోస్ట్ వాంటెడ్ లేదా ప్రమాదకరమైన నేరస్థుడని సెకన్లలో అలర్ట్ రావడం వల్ల పోలీసులు ముందే అప్రమత్తమై తగిన రక్షణ చర్యలు తీసుకోవచ్చు.
ఈ భారీ డేటాబేస్లో కేవలం సాధారణ దొంగలు మాత్రమే కాదు.. సుమారు 9.91 లక్షల మంది డ్రగ్స్ స్మగ్లర్లు (నార్కోటిక్స్ అఫెండర్స్), 3.65 లక్షల హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) నిందితులతో పాటు దేశంలోని అన్ని జైళ్లలో ఉన్న ఖైదీల పూర్తి ప్రొఫైల్స్ నిక్షిప్తమై ఉన్నాయి.
చట్టపరమైన సవాళ్లు కూడా..!
టెక్నాలజీ పరంగా ఇది అద్భుతమైన ముందడుగు అయినప్పటికీ, దీనిపై కొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా వ్యక్తమవుతున్నాయి. 'క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్, 2022' ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఈ చట్టంలోని సెక్షన్-3 ప్రకారం, నేరాల్లో నిందితులుగా ఉన్నవారు, అరెస్ట్ అయినవారు లేదా కోర్టు ఆదేశాల మేరకు నిఘాలో ఉన్నవారి వేలిముద్రలను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది.
ఎటువంటి నేరంతోనూ సంబంధం లేని సాధారణ పౌరులను వీధుల్లో ఆపి ఇలా ముందస్తు అనుమతి లేకుండా రాండమ్గా బయోమెట్రిక్ పరీక్షలు చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, నేర రహిత సమాజ స్థాపనలో 'అభిజ్ఞాన్’ యాప్ భవిష్యత్తులో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.














Click it and Unblock the Notifications