ABP-CVoter Survey: మోడీ ఇలాకాలో బీజేపీ రికార్డు విజయం, కాంగ్రెస్కు ఆప్ షాక్
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఏబీపీ-సీఓటర్ సర్వే తేల్చేసింది. అధికారం కోసం పోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చనుందని పేర్కొంది. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్లో బీజేపీకి 134-142 సీట్లు
గుజరాత్లో డిసెంబర్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. రాష్ట్రంలో మూడింట రెండొంతుల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోటను నిలుపుకుంటుందని తాజా ఏబీపీ-సీవోటర్ సర్వే అంచనా వేసింది. 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 134-142 సీట్లు కైవసం చేసుకోవచ్చని సర్వే అంచనా వేసింది.
మోడీ ఇలాకాలో బీజేపీ విజయాన్ని ఆపలేని ప్రధాన పార్టీలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా.. డిసెంబర్ 8న హిమాచల్ ఎన్నికలతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరుసార్లు విజయం సాధించింది. అయితే ఈసారి దూకుడుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కొత్త రూపం కాంగ్రెస్.. బీజేపీ విజయాన్ని అడ్డుకోవడంలో విఫల ప్రయత్నం చేసినట్లేనని పేర్కొంది.
బీజేపీ రికార్డు విజయం.. కాంగ్రెస్కు కేజ్రీవాల్ షాక్
2017 ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకున్నాయి. తాజా సర్వే ప్రకారం ఈసారి కాంగ్రెస్ 28-36 సీట్లు గెలుచుకోగా, రాష్ట్రంలో ఆప్ తన ఖాతా తెరిచి 7-15 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ల శాతం పరంగా చూస్తే, పోల్ అయిన ఓట్లలో 45.9 శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని అంచనా వేసింది. ఇది 2017 గుజరాత్ ఎన్నికలలో వచ్చిన దానికంటే 3.2 శాతం తక్కువ. రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 26.9 శాతం ఓట్లను మాత్రమే సాధిస్తుందని అంచనా. ఇది గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే -14.5 శాతం గణనీయంగా పడిపోయింది. ఇసుదాన్ గద్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మొత్తం పోలైన ఓట్లలో 21.2 శాతం ఓట్లను పొందగలదని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. ఆప్ గణనీయంగా ఓటు శాతాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్లో బీజేపీదే ఆధితప్యం
ప్రాంతాల వారీగా సర్వే ప్రకారం సెంట్రల్ గుజరాత్లో బీజేపీ 45-49 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్కు 10-14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మధ్య గుజరాత్లో 61 నియోజకవర్గాలు ఉన్నాయి. 32 నియోజకవర్గాలున్న ఉత్తర గుజరాత్లో బీజేపీ 20-24 సీట్లు, కాంగ్రెస్కు 8-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కాషాయ పార్టీ దక్షిణ గుజరాత్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. మొత్తం 35 నియోజకవర్గాల్లో 27-31 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్కు కేవలం 2-6 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది. 54 సీట్లున్న కచ్-సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీ 38-42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 4-8 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా. ఈ ప్రాంతంలో ఆప్కి 7-9 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.