రాహుల్ గాంధీ రైట్, ప్రధాని మోడీ పారిపోయారు, బెంగళూరులో ఎంపీగా పోటీ, ప్రకాష్ రాజ్!
బెంగళూరు: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళలను కించపరచలేదని, ఆయన వ్యాఖ్యలను ఒక్క కోణంలోనే చూడకూడదని ప్రముఖ బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. మహిళలను ఎంతో గౌరవించే రాహుల్ గాంధీ వారికి కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రధాన్యత ఇచ్చారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రధాని మోడీ పారిపోతున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
ఇటీవల తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా హిజ్రాను నియమించి వారిని గౌరవించారని ప్రకాష్ రాజ్ అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీతో సహ బీజేపీ నాయకులు వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
పార్లమెంట్ సమావేశాల్లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో సమాధానం చెప్పలేక ప్రధాని నరేంద్ర మోడీ పారిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను అడ్డం పెట్టుకుని రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో సమాధానం చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీ తప్పించుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.
భారతదేశ మొదటి మహిళా రక్షణ శాఖా మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ను విమర్శించి ఆమె పదవిని అవమానించారని, రాహుల్ గాంధీ మహిళా మంత్రిని మాత్రమే అవమానించలేదని, దేశంలోని మొత్తం మహిళా జాతిని అవమానించారని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మహిళలను అవమానించే వారు దేశాన్ని పాలించాలని తాపత్రయం పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని విమర్శించారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను విమర్శించిన రాహుల్ గాంధీకి గురువారం జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రాహుల్ గాంధీ అవమానించలేదని, ఆయనకు తన మద్దతు ఉంటుందని ప్రకాష్ రాజ్ చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఇటీవల అమ్ ఆధ్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన అధికారిక నివాసంలో ప్రకాష్ రాజ్ భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.