కేరళ కు మహార్దశ.. అదానీ గ్రూప్ రూ.30 వేలకోట్ల పెట్టుబడులు..
కేరళలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక ప్రగతిని సాధించేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025 లో సంస్థ ప్రకటించింది. కేరళలోని పోర్టుల అభివృద్ధి, ఎయిర్ పోర్ట్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన.. తదితర అంశాలపై దృష్టి సారించినట్లు అదానీ పోర్ట్స్, SEZ లిమిటెడ్, MD, కరణ్ అదానీ ప్రకటించారు.
రూ. 20,000 కోట్లతో పోర్టు అభివృద్ధి..
అదానీ గ్రూప్ కేరళలో 'Vizhinjam' పోర్టును అభివృద్ధి చేస్తోంది. ఈ పోర్టు అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. మరో రూ. 20,000 కోట్లతో పోర్టును మరింత అభివృద్ధి చేస్తోంది. 24 వేల కంటైనర్ కెపాసిటీ ఉండేలా పోర్టును విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టుల నుంచి ఇక్కడకు రవాణా మార్గాన్ని సులభతరం చేయనుంది.
ఎయిర్పోర్టు అభివృద్ధి..
అదానీ గ్రూప్ రూ.5,500 కోట్ల పెట్టుబడితో తిరువనంతపురం ఎయిర్పోర్టును విస్తరించనుంది. ఎయిర్ పోర్టు సామర్థ్యాన్ని ఏడాదికి 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.20 కోట్లకు సరిపడా విస్తరించనున్నట్లు MD కరణ్ అదానీ తెలిపారు. అలాగే కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్ను ఏర్పాటు చేస్తామని.. అదే ప్రాంతంలో సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం ఉమెన్ ఛాందీ కేరళ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

వికసిత్ భారత్.. అలా సాధ్యం..
అదానీ గ్రూప్ MD కరణ్ అదానీ.. ప్రధాని మోదీ ప్రకటించిన వికసిత్ భారత్ పై ప్రసంగించారు. ప్రధాని మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే స్థానికంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మెరుగవ్వాలని అన్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం అని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి 3,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు 6 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications