తొలిసారిగా: థాక్రే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ఆదిత్య థాక్రే
ముంబై: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ శివసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో అనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఆ పార్టీ నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. దక్షిణ ముంబై ప్రాంతంలోని ఓర్లీ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. అంతేకాదు థాక్రే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య థాక్రే కావడం విశేషం. ప్రస్తుతం శివసేన యూత్ వింగ్ యువసేన అధ్యక్షుడిగా ఆదిత్య థాక్రే వ్యవహరిస్తున్నారు.
ఆదిత్య థాక్రే పోటీపై ఆ పార్టీ అధికారిక ప్రకటన చేయనప్పటికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆదిత్యకు ఏబీ ఫారం అందజేసినట్లు సమాచారం. ఈయనతో పాటు మరో 19 మంది కూడా ఏబీ ఫారంను అందుకున్నారు. అయితే ఈ 20 సీట్లలో బీజేపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ పొత్తు మాత్రమే ఖరారు కాగా... సీట్ల పంపకాలపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన జరగలేదు. ఆదిత్యథాక్రే ఓర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారని శివసేనకు చెందిన అత్యంత ముఖ్యమైన వ్యక్తి వెల్లడించారు.
ఓర్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే శివసేన నేత సునీల్ షిండే తన సీటును ఆదిత్య కోసం త్యాగం చేయనున్నారు. ఓర్లీ అసెంబ్లీ నియోజకవర్గం పై శివసేనకు మంచి పట్టున్న స్థానం అని ఆదిత్య అక్కడి నుంచి పోటీచేస్తే తప్పక విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు శివసేనకు ఓర్లీ స్థానం చాలా సురక్షితమైందిగా చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతం నుంచి బలమైన నాయకుడు మాజీ ఎన్సీపీ నేత సచిన్ ఆహిర్ కూడా శివసేనలో చేరడంతో ఇక ఇక్కడ ఆదిత్య విజయం నల్లేరుపై నడకే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. శివసేనకు చెందిన అభ్యర్థి ఏదో ఒకరోజు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా చేస్తామని తన తండ్రి బాలాసాహెబ్ థాక్రేకు తాను మాట ఇచ్చినట్లు ఉద్ధవ్ థాక్రే శనివారం ప్రకటించారు.