వణికిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ; కేరళ, యూపీతో పాటు ఆ రాష్ట్రాల్లో పందులకు వైరస్!!
ఇప్పుడు దేశాన్ని ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేరళ, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ .. 300 పందులు చంపాలని ఆదేశం
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మనంతవాడి వద్ద రెండు పొలాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నమోదైందని అధికారులు ఈరోజు తెలిపారు. భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్లో శాంపిల్స్ను పరీక్షించగా జిల్లాలోని రెండు పొలాల పందులకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. పశుసంవర్థక శాఖకు చెందిన ఒక అధికారి ఒక పొలంలో పందులు మూకుమ్మడిగా చనిపోవడంతో నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు చెప్పారు. పరీక్ష ఫలితం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సంక్రమణను నిర్ధారించింది. దీంతో రెండవ ఫారమ్లోని 300 పందులను చంపడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి" అని అధికారి తెలిపారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ తెలిపింది.

ఉత్తరప్రదేశ్ బరేలీలోనూ ఆఫ్రికా స్వైన్ కలకలం
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలి లోనూ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసు నమోదైంది. మిజోరం, త్రిపుర, అస్సాం తర్వాత ఇప్పుడు బరేలీలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు నమోదైందని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడి నవాబ్గంజ్ తహసీల్లోని భద్సర్ దాండియా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తికి చెందిన పంది ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించినట్టు సింగ్ చెప్పారు. ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన ప్రదేశం నుంచి కిలోమీటరు దూరాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటిస్తున్నట్లు సింగ్ తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ మానవులకు ముప్పు కలిగించనప్పటికీ, సోకిన పందితో సంబంధం ఉన్న పశుసంవర్ధక కార్మికులు ఈ వ్యాధిని ఇతర జంతువులకు వ్యాపింపజేయవచ్చు ఆయన పేర్కొన్నారు.

లక్నోలో పంది మాంసం విక్రయాలపై నిషేధం
ఉత్తర ప్రదేశ్ లక్నోలో పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందడంతో లక్నోలో పంది మాంసం మరియు సంబంధిత ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 100 పైగా పందుల మరణాలు నిర్ధారించబడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ పంది మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. నిషేధంతో, జిల్లా మేజిస్ట్రేట్ లక్నో మున్సిపల్ కార్పొరేషన్ (ఎల్ఎంసి) మరియు పశుసంవర్ధక శాఖ పందులలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి చర్య తీసుకోవాలని ఆదేశించారు.

మిజోరాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఆందోళన
ఇదిలా ఉంటే మిజోరాం న్యూ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బారిన పడినట్లు అనుమానిస్తున్నమూడు అడవి పందులు మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని తూర్పు మిజోరాంలోని చంఫాయ్ జిల్లాలోని లీసెన్జో గ్రామ సమీపంలోని అడవిలో చనిపోయాయని రాష్ట్ర పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలోని అడవిలో రెండు ఆడ పందులు, ఒక అడవి పంది కళేబరాలను స్థానికులు గుర్తించినట్లు అధికారి తెలిపారు.

మిజోరాంలో విధ్వంసం సృష్టిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ..
అడవి పందులు అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినప్పటికీ, వాటి మరణాల వెనుక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉన్నట్లు బలంగా విశ్వసిస్తున్నట్లు అధికారులు చెప్పారు. గత మూడు రోజులుగా అత్యంత అంటువ్యాధి అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పంది వ్యాధి కారణంగా 267 పందులు మరియు పందిపిల్లలు మరణించడంతో మిజోరాంలో పందుల పెంపకంపై విధ్వంసం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విధ్వంసం కొనసాగుతోంది. ప్రస్తుతం 11 జిల్లాల్లో 10 జిల్లాల్లో 119 గ్రామాలు, ప్రాంతాలపై ఈ మహమ్మారి ప్రభావం చూపిందని తెలిపింది.

మనుషులపై నో ఎఫెక్ట్
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పందులకు సోకే అత్యంత అంటువ్యాధి. దాని తీవ్రమైన రూపంలో, వ్యాధి సాధారణంగా అధిక మరణాలకు దారితీస్తుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది స్వైన్ ఫ్లూకి భిన్నమైన వ్యాధి. ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేయదు. మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపించదని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications